యువత అభివృద్ధి వైపు పయనించాలి
ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్
అటవీ ప్రాంతంలో మందుగుండు సామగ్రి నిర్వీర్యం
విలేకరుల సమావేశంలో వెల్లడి
ములుగు, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ) : మావోయిస్టు పార్టీ ప్రలోభాలకు ఏజెన్సీ ప్రాంత ప్రజలు, యువత లొంగవద్దని, సన్మార్గాలను ఎంచుకుని అభివృద్ధి వైపు పయనించాలని ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ అన్నారు. ఏటూరునాగారం మండలం దొడ్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేయగా మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జనవరి 31న సాయంత్రం మావోయి స్టు పార్టీకి చెందిన అగ్రనాయకుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల మేరకు జేఎంఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్యులు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకన్న, కుర్రం మంగు అలియాస్ భద్రు, ముచ్చెకి ఉంగల్ అలియాస్ రఘుఅలియాస్ సుధాక ర్, ఏటూరునాగారం-మహాదేవపూర్ కమాండర్ కొ వ్వాసి గంగ అలియాస్ మహేశ్, సోడి కోసి అలియాస్ ఝాన్సీతో పాటు మరికొంతమంది మావోయిస్టులు పోలీసులను హతమార్చేందుకు పథకం రంచించారని అన్నారు. ఇందులో భాగంగా ఏటూరునాగారం మం డలం దొడ్ల గ్రామ రిజర్వు ఫారెస్టులో పేలుడు సామగ్రిని దాచినట్లు చెప్పారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఏటూరునాగారం సీఐ, ఎస్సై, సిబ్బంది, బీడీ టీమ్, 39బీ అసిస్టెంట్ కమాండెంట్ అమిత్కుమార్, సీఆర్పీఎఫ్తో దొడ్ల ఏరియాలోని అటవీ ప్రాంతానికి చేరుకుని తనిఖీ చేస్తుండగా చెట్ల పొదల్లో నాలా ప్రాంతంలో తవ్వి చూడగా ఒక బ్రౌన్ కలర్ బకెట్ కనపడినట్లు తెలిపారు. దీనిని బయటకు తీసి పరిశీలించగా అందులో 10 జిలిటెన్స్టిక్స్, 10 డిటోనేటర్లు, 3 క్లెమోర్మైన్స్ (వంక పైపులు), 5 కప్లింగ్స్, 33 ఎస్ఎల్ఆర్ లైఫ్ గ్రౌండ్స్, 1 ఫైర్ అయిన రౌండ్ ఎస్ఎల్ఆర్, 1 ఫైర్ అయిన రౌండ్ ఏకే-47, 1 బ్యాటరీ, 100 మీటర్ల వైర్ బండెల్, రెండు కిలోల మేకులు దొరికినట్లు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. మావోయిస్టు పార్టీకి ఎవరూ సహకరించొద్దని, ఎవరైన అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో ఓఎస్డీ శోభన్కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్కుమార్, సీఆర్పీఎఫ్ 39 అసిస్టెంట్ కమాండెంట్ అమిత్కుమార్, ఏటూరునాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.