ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
నర్సంపేట, జనవరి 31 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సోలార్ ల్యాంప్లను ఉచితంగా అందజేయడానికి ఎమ్మెల్యే సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో ఎంఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 6,200 మంది విద్యార్థులకు రూ.700 చొప్పున విలువైన సోలార్ విద్యుత్ దీపాలను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా కంటికి సురక్షితమైన వెలుగునిచ్చే సోలార్ దీపాలను అందజేస్తున్నట్లు తెలిపారు.
ఎల్వోసీ అందజేత
దుగ్గొండి మండలం మైనంపల్లికి చెందిన ఈద రాజలింగయ్య అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతడి కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి రూ.1లక్ష ఎల్వోసీ పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునేస్థోమత లేని వారికి సీఎంఆర్ఎఫ్ వరంలా మారిందని తెలిపారు. ఆరోగ్యశ్రీలో వర్తించని అనేక రోగాలకు ఎల్వోసీ ద్వారా వైద్యసేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, ఎంఈఓ రత్నమాల తదితరులు పాల్గొన్నారు.
దళితబంధుతో మారనున్న బతుకులు
నల్లబెల్లి : దళిత బంధుతో నిరుపేదల బతుకులు మారనున్నాయని ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ అన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలులో మండలంలోని రామతీర్థం గ్రామాన్ని మొదటి విడతలో ఎంపిక చేయడంపై ఎంపీపీ, గ్రామంలోని దళిత కుటుంబాలతో కలిసి సీఎం కేసిఆర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు సోమవారం పాలాభిషేకం చేశారు. ఆమె మాట్లాడుతూ దళిత కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలకోటి కిరణ్ పాల్గొన్నారు.