అసెంబ్లీ ఎన్నికలకు జయశంకర్ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. భూపాలపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లతో ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. నియోజకవర్గంలో 317 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 2,68,028 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రత్యేకంగా మహిళా, దివ్యాంగులు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు, 87 ఏండ్లు దాటిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మద్యం, డబ్బు సరఫరాను అరికట్టేందుకు నియోజకవర్గంలో రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారి భవేశ్మిశ్రా ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భూపాలపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు, సెక్టార్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లతో ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం రిటర్నింగ్ ఆఫీసర్లు తమ పరిధిలో ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్కాడ్లు, ఎంసీసీ వీడియో సర్వేలెన్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు, పోస్టల్ బ్యాలెట్లు, ఎన్నికల సామగ్రి సేకరణపై రిటర్నింగ్ ఆఫీసర్లు దృష్టి పెట్టారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు అవసరమైన స్ట్రాంగ్ రూంలను గుర్తిస్తున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 317 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,68,028 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మహిళా, దివ్యాంగులు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు, 87 సంవత్సరాలు దాటిన వారికి ఇంటి వద్దే రహస్య ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమంగా మద్యం, డబ్బు సరఫరాను అరికట్టేందుకు నియోజకవర్గంలో రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గంలో 317 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేసిన అధికారులు వసతుల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల్లో కరెంటు, తాగునీరు, టాయిలెట్స్, ర్యాంప్లు తదితర సౌకర్యాలు ఉండాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించగా, ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సిబ్బంది, పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్ అధికారుల బృందం పోలింగ్ కేంద్రాల్లో సర్వే నిర్వహించి నివేదికను జిల్లా ఎన్నికల అధికారికి ఇవ్వనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు కలెక్టర్ నిధులు మంజూరు చేయనున్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో 317 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, వాటిలో ప్రత్యేకంగా మహిళా, దివ్యాంగులు, మోడల్, యూత్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం నంబర్ 27(పవిత్ర కళాశాల భూపాలపల్లి), 146 (గణపురం హైస్కూల్), 166 (చిట్యాల హైస్కూల్), 192 (మొగుళ్లపల్లి హైస్కూల్), 223 (రేగొండ హైస్కూల్) పోలింగ్ కేంద్రాలను మహిళలకు కేటాయించారు. అలాగే భూపాలపల్లిలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 38 (మైన్స్ రెస్క్యూ రూం)ను దివ్యాంగులకు కేటాయించారు. అలాగే పోలింగ్ స్టేషన్ నంబర్ 30 (మైన్స్ రెస్క్యూం రూం, భూపాలపల్లి), 110 (జడల్పేట ఎంపీఎస్), 141 (గణపురం హైస్కూల్), 195 (మొగుళ్లపల్లి హైస్కూల్), 225 (రేగొండ హైస్కూల్) పోలింగ్ స్టేషన్లను మోడల్ పోలింగ్ స్టేషన్లుగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా భూపాలపల్లిలోని 46వ పోలింగ్ స్టేషన్ (ప్రభుత్వ జూనియర్ కళాశాల)ను యూత్ పోలింగ్ స్టేషన్గా ఏర్పాటు చేశారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగేందుకు జిల్లా ఎన్నికల అధికారి ప్రత్యేకంగా ఎంసీసీ, వీసీటీ, ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్ టీంలను ఏర్పాటు చేశారు. శాయంపేట, రేగొండ, గోరికొత్తపల్లికి ఒకటి, భూపాలపల్లి, గణపురానికి ఒకటి, మొగుళ్లపల్లి, చిట్యాల, టేకుమట్లకు ఒకటి చొప్పున మూడు ఫ్లయింగ్ స్కాడ్ టీంలను ఏర్పాటు చేశారు. ఒక టీంలో ముగ్గురు సభ్యులు పనిచేస్తారు. వీరు 24 గంటలు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తారు. అలాగే మూడు వీడియో సర్వేలెన్స్ టీంలు ఎనిమిది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) టీంలను, మూడు స్టాటిక్ సర్వేలెన్స్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీంలు మూడు షిఫ్టుల్లో 24గంటలు విధుల్లో ఉంటా యి. భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి, రేగొండలో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు.
దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వారు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఎన్నికల కమిషన్ తొలిసారిగా దివ్యాంగులు, 80ఏళ్లు దాటిన వారు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. జిల్లాలో 80 ఏళ్లు దాటిన ఓటర్లు 4,647 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 6,861 మంది ఉన్నారు. ఎన్నికలకు ఒక రోజు ముందు వీరు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో రహస్య ఓటు వేయొచ్చు. ఇలా ఓటు వేయాలనుకునే దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వారు ముందస్తుగానే బీఎల్వోలకు ఫాం-12డీ పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతించాక దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వారు ఇంటి వద్దే రహస్య ఓటింగ్ పద్ధతిలో బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకోవచ్చు.