నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 25 : మిత్రుల మధ్య తలెత్తిన గొడవను ఆపేందుకు వెళ్లిన ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మండలంలోని లక్నేపల్లిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామానికి చెందిన నకీర్తి భాస్కర్-కవిత దంపతుల కుమారుడు సంజయ్ (19) ఆ కళాశాలలో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మరో నలుగురు విద్యార్థులతో కలిసి కళాశాల వసతి గృహంలో ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ఓ విద్యార్థి కారణంగా కళాశాల హాస్టల్ గది కిటికీ పగిలిపోయింది. విషయం యాజమాన్యానికి తెలియగా, ఆ గదిలో ఉన్న వారంతా కలిసి డ్యామేజీ ఖర్చులు భరించాలని సూచించింది. ఈక్రమంలో అద్దం పగులగొట్టిన విద్యార్థితో మిగతా విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం హాస్టల్ గదిలో మరోసారి ఘర్షణ పడ్డారు. వారిని ఆపేందుకు వెళ్లిన సంజయ్ని తోటి విద్యార్థులు తోసేయడంతో హాస్టల్ భవనం పైనుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన సంజయ్ని నర్సంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి వరంగల్లోని మరో ప్రైవేట్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని శనివారం ఎస్సై రామ్చరణ్ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, విద్యార్థి సంఘాల నాయకులు నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సంజయ్కి న్యాయం చేయాలని, నిర్లక్ష్యం వహించిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.