పర్వతగిరి, జులై 17: మారుమూల గ్రామాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆన్లైన్ పాఠాలపై అవగాహన కల్పించాలని జిల్లా నోడల్ అధికారి ఆజామొయినొద్దీన్ ఉపాధ్యాయులకు సూచించారు. మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, టీడబ్ల్యూఆర్ఎస్, విజ్డమ్ ప్రైవేట్ స్కూల్, గుంటూరుపల్లి ప్రభుత్వ పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, బడీడు పిల్లల వివరాలు, తాగునీటి వసతి తదితర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. ఈ ఏడాది పాఠశాలల వివరాలు జిల్లా అధికారులకు పంపించాల్సిన తీరుపై టీచర్లకు అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి ఆన్లైన్ క్లాసులు వీక్షించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఆర్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పిల్లలు పాఠాలు వినేలా చూడాలి
దుగ్గొండి: ప్రతి విద్యార్థి ఆన్లైన్ పాఠాలు వినేలా చర్యలు తీసుకోవాలని జిల్లా మానిటరింగ్ అధికారి సారయ్యనాయక్ సూచించారు. మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలతోపాటు మల్లంపల్లి, గిర్నిబావి సర్కారు బడులు, గిర్నిబావిలోని ఎంజేపీటీ గురుకులం, మల్లంపల్లి కేజీబీవీ, దుగ్గొండిలోని ఆదర్శవాణి పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి పాఠశాలలు, గురుకులాల హెచ్ఎంలు, ప్రత్యేకాధికారులతో మాట్లాడారు. వందశాతం విద్యార్థులు స్మార్ట్ఫోన్ లేదా టీవీ లేదా రేడియో ద్వారా ఆన్లైన్ క్లాసులు వినేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను పరిశీలించారు. డైస్ ఫామ్ల ప్రకారం వందశాతం విద్యార్థుల హాజరు ఉండేలా చూడాలన్నారు. ఆయన వెంట హెచ్ఎంలు లీలా, మంజుల, కూరోజు దేవేందర్, వెంకటేశ్వర్లు, యుగేంధర్, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆన్లైన్ క్లాసులను వినియోగించుకోవాలి
నడికూడ: దూరదర్శన్, టీశాట్ ద్వారా ప్రసారమవుతున్న ఆన్లైన్ పాఠాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సర్పంచ్ ఊర రవీందర్రావు అన్నారు. మండలకేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు హెచ్ఎం పట్టాభి ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. ఆన్లైన్ క్లాసులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ జగన్నాథుల భాస్కర్, ఉపాధ్యాయులు జడల శ్రీనివాస్, ఊరుగొండ రమేశ్, నాసగోని రాజు, పోతరాజు కిషన్, శ్రీరాముల శ్రీనివాసరావు పాల్గొన్నారు.