పర్వతగిరి, సెప్టెంబర్ 1 : నియోజకవర్గంలోని ప్రజలు అందుబాటులో ఉంటానని, ఇందుకు పార్టీ కార్యాలయాలు ఎంతగానో దోహదపడుతాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవారం మండలంలోని కల్లెడ గ్రామంలో నూతనంగా నిర్మించిన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రమేశ్ – కవిత దంపతులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని మండలానికో కార్యాలయాన్ని నిర్మించామని, ప్రజల సమస్యలు ఇక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో ఒక్క రోజు ప్రజలు, నాయకులకు అందుబాటులో ఉంటానన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారని, అప్పుడే నాయకులపై నమ్మకం పెరుగుతుందన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రూ. 1,80లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సింగ్లాల్, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు చింతపట్ల సోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడుగుల రాజు, సర్పంచ్ మాలతి, మండలాధ్యక్షుడు రంగు కుమార్, సర్పంచ్ అమడగాని రాజు తదితరులు పాల్గొన్నారు.