ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ భగీరథ’
ప్రతి ఇంటికీ నల్లా బిగించాలి
లీకేజీలను సమూలంగా అరికట్టాలి
సమీక్షలో మేయర్ గుండు సుధారాణి
వరంగల్, మార్చి 25: వేసవిలో నగరంలో రోజూ తాగునీరు సరఫరా చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో శుక్రవారం ఆమె కమిషనర్ ప్రావీణ్యతో కలిసి తాగునీటి సరఫరాపై పబ్లిక్ హెల్త్, బల్దియా ఇంజినీర్లతో సమీక్షించారు. 24 గంటల తాగునీటి సరఫరాపై రూపొందించిన డీపీఆర్పై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటికీ రక్షిత తాగునీరు అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారన్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్లు ఇచ్చి మీటర్లు బిగించి నీటి సరఫరా చేయాలన్నారు. నగరంలో గుర్తించిన 247 లీకేజీలను పబ్లిక్ హెల్త్, బల్దియా అధికారులు తక్షణమే అరికట్టాలని ఆదేశించారు. అవసరమైతే సిబ్బందిని పెంచుకొని సకాలంలో లీకేజీలకు మరమ్మతు పనులు చేయాలని సూచించారు. అలాగే, ఇంటర్ కనెక్షన్ పనులు చేపట్టాలన్నారు. మూడు బట్టర్ ఫ్లై వాల్వ్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మేయర్ పబ్లిక్ హెల్త్ అధికారులను ఆదేశించారు.
ప్రతి కనెక్షన్కు మీటర్ బిగించాలి
ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో మిషన్ భగీరథ ద్వారా 1,18,160 నల్లా కనెక్షన్లు ఇచ్చి, కేవలం 83 వేల నల్లాలకు మీటర్లు బిగించారని సుధారాణి తెలిపారు. వెంటనే మిగిలిన నల్లాలకు మీటర్లు బిగించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. దీనితోపాటు ప్రతి నల్లాకు ఆన్ ఆఫ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మిషన్ భగీరథలో భాగంగా అసంపూర్తిగా మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరబాటలో గుర్తించిన పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాత పైపులైన్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. విలీన గ్రామాల్లోని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ పబ్లిక్ హెల్త్, బల్దియా అధికారులు సమన్వయంతో తాగునీటి సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. జోన్ల వారీగా లీకేజీలను గుర్తించి, వాటని ప్రణాళికాబద్ధంగా అరికట్టాలన్నారు. సమీక్షలో బల్దియా ఎస్ఈలు సత్యనారాయణ, ప్రవీణ్ చంద్ర, ఈఈలు శ్రీనివాస్, ప్రవీణ్కుమార్, శ్రీనివాసరావు, పబ్లిక్ హెల్త్ ఈఈ రాజ్కుమార్, బల్దియా డీఈలు సంతోష్బాబు, రవీందర్, నరేందర్, రవికిరణ్, సంజయ్కుమార్, రవికుమార్, పబ్లిక్ హెల్త్ డీఈలు శ్రీనివాసరెడ్డి, నుస్రత్ జహన్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
క్షయవ్యాధిపై అవగాహన కల్పించాలి
క్షయ వ్యాధిపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని మేయర్ సుధారాణి అన్నారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో బ్రేకింగ్ ఆఫ్ బ్యారీస్ స్వచ్ఛంద సంస్థ, మెప్మా సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మెప్మా సీవోలు ఆర్పీల ద్వారా మహిళా సంఘాల సభ్యులకు టీబీపై చైతన్యం తీసుకురావాలన్నారు. విస్తృతంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, ఆశ వర్కర్లు ఇంటింటికీ వెళ్లి క్షయవ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షయ నివారణ అధికారి డాక్టర్ సుధార్సింగ్ మాట్లాడుతూ నగరంలో 70 ప్రాంతాల్లో టీబీ లక్షణాలు ఉన్న వారిని గుర్తించామన్నారు. దశలవారీగా సదస్సులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామన్నారు. సమీక్షలో బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి, సీడీపీవో విశ్వజ, మెప్మా పీఎంఈ రమేశ్, బ్రేకింగ్ ఆఫ్ బ్యారీస్ ప్రాజెక్ట్ కో అర్డినేటర్లు ప్రభాకర్, ప్రశాంత్, మెప్మా సీవో, ఆర్పీ, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.