వరంగల్, ఫిబ్రవరి 12: మిషన్ భగీరథ మెయిన్ పైపులైన్ ఇంటర్ కనెక్షన్ పనులను వెంటనే పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కార్పొరేషన్ కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, బల్దియా ఇంజినీర్లతో ఆమె సమీక్షించారు. ధర్మసాగర్ 2100 ఎంఎం డయా పైపులైన్కు ఎల్ఎండీ నుంచి వచ్చే 1400 ఎంఎం డయా పైపులైన్ ఇంటర్ కనెక్షన్ చేస్తే నీటి లభ్యత పుష్కలంగా ఉంటుందన్నారు. ధర్మసాగర్ రా వాటర్ తగ్గినా ఇంటర్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట, రైల్వే జోన్లకు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ధర్మసాగర్ వద్ద కొత్తగా లూయీస్ వాల్వ్ను అమర్చడం ద్వారా నీటి సరఫరాలో సమస్యను అధిగమించొచ్చన్నారు. వడ్డేపల్లి, కేయూసీ, దేశాయిపేట, రైల్వే జోన్ల పరిధిలో వాటర్ డిస్ట్రిబ్యూషన్, నల్లా కనెక్షన్లు, నీటి మీటర్ల బిగింపు ప్రక్రియను మార్చి మొదటి వారంలోగా పూర్తి చేయాలన్నారు. సమీక్షలో పబ్లిక్ హెల్త్ ఈఈ రాజ్కుమార్, బల్దియా ఈఈ బీఎల్ శ్రీనివాస్రావు, పబ్లిక్ హెల్త్ డీఈలు శ్రీనాథ్, ఇస్రత్, పాల్గొన్నారు.