ఖిలావరంగల్, సెప్టెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో 17వ డివిజన్లోని వసంతపురం, ఆదర్శనగర్, స్తంభంపల్లి, దూపకుంట, గాడిపెల్లి, బొల్లికుంటకు చెందిన 19 మంది లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ సర్కారు పార్టీలకతీతంగా అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు.
చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును అనతి కాలంలోనే నిర్మించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రవేశపెట్టే దమ్ము ఆ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. కల్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడపడుచులకు సీఎం కేసీఆర్ మేనమామ అయ్యారన్నారు. ఆసరా పింఛన్లతో ఇంటికి పెద్ద కొడుకుగా నిలిచారన్నారు. ఇప్పుడు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపుతున్నారని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గద్దె బాబు, ఏఎంసీ డైరెక్టర్ తుమ్మ సాగర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.