నర్సంపేట రూరల్, సెప్టెంబర్ 15: ప్రత్యక్ష తరగతులను అన్ని పాఠశాలల విద్యార్థులు వినియోగించుకోవాని డీఈవో డీ వాసంతి సూచించారు. కమ్మపల్లి, మాదన్నపేట జడ్పీఎస్ఎస్లను బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. పాఠశాలల్లో పారిశుధ్య పనులపై ఆరా తీశారు. ప్రతి తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో కలిసి కూర్చొని ఉపాధ్యాయులు బోధించే తీరును గమనించారు. పలువురు విద్యార్థులను ప్రశ్నించి వారి ప్రతిభను గుర్తించారు. కమ్మపల్లి హైస్కూల్లో 6వ తరగతి గదికి వెళ్లిన డీఈవో గణితాన్ని బోధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి వాతావరణాన్ని కల్పించాలన్నారు. అలాంటప్పుడే పిల్లలు ఉత్సాహంగా బడికి వస్తారన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగ్గా ఉన్నాయని, తల్లిదండ్రులు విద్యార్థులను సర్కారు బడుల్లో చేర్పించాలని కోరారు. ఉపాధ్యాయులు విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లపై ఉందని గుర్తుచేశారు. ఆమె వెంట హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సీఆర్పీలు ఉన్నారు.
పాఠశాల రికార్డుల పరిశీలన
చెన్నారావుపేట: జల్లి నంబర్-1 కాలనీ, జోజిపేట ప్రాథమిక పాఠశాలలను కాంప్లెక్స్ హెచ్ఎం రవి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, అటెండెన్స్ రిజిస్టర్లు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచాలని టీచర్లకు సూచించారు. ఆయన వెంట హెచ్ఎం ఈదునూరి రవీందర్రెడ్డి, ఉపాధ్యాయులు రజిత, వెంకటయ్య, ఎస్ఎంసీ చైర్మన్ అశోక్, సీఆర్పీ సంపత్ ఉన్నారు.