శ్రీనివాస్కు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో నాలుగెకరాల్లో బీర, కాకర, ఒక ఎకరంలో టమాట వేశాడు. మిగతా ఎకరంలో వరి సాగుచేస్తున్నాడు. అది కూడా పశువులకు మేత కోసమే. అలాగే దుక్కి దున్నే సమయంలో పశువుల పెంపకం ద్వారా వచ్చే పది ట్లాక్టర్ల పేడను ఎరువుగా వేస్తున్నాడు. దీనికితోడు రెండు బస్తాల కాంప్లెక్స్ ఎరువులను(ఒక ఎకరానికి) వేసి ట్రాక్టర్తో చదును చేశాడు. అలాగే నాలుగు ఫీట్ల వెడల్పు, ఒక ఫీట్ ఎత్తుతో బోదెలను తయారు చేసుకొని వీటిలో డ్రిప్ పైపులను పరిచాడు. దానిపై మల్చింగ్ పేపర్ను వేసి గాలి వెళ్లకుండా పేపర్ చుట్టూ మట్టితో ఏర్పాటుచేసుకున్నాడు. మల్చింగ్ పేపర్పై ఫీటున్నర దూరంలో రంధ్రాలు చేసి బీర, కాకర, టమాట విత్తనాలను వేశాడు. తొలుత ప్రభుత్వం ఇచ్చే రూ.85వేల సబ్సిడీతో మల్చింగ్ షీట్లు, డ్రిప్ ఏర్పాటుచేశాడు. బీర విత్తనాలు మొలకెత్తిన వారం వ్యవధి నుంచి వారానికోసారి నీటిలో కరిగే త్రిబుల్నైన్టీన్, ట్వంటీ ఎయిట్ ఎరువులను ఎకరానికి 4 నుంచి 5 కిలోలు వేస్తాడు. బీర, కాకరకాయలు కోతకు వచ్చాక రోజు విడిచి రోజు తెంపి పంట పూర్తి అయ్యేవరకు ఎకరాకు 20 నుంచి 25 కోతల పంట చేతికందుతోంది. ఇలా ఎకరానికి ఖర్చులన్నీ పోను బీరకు ధరను బట్టి రూ.1.50 లక్షలు మిగులుతున్నాయి. మార్కెట్లో ధర తక్కువగా ఉన్నా రూ.50వేల గిట్టుబాటు అవుతుందని చెబుతున్నాడు శ్రీనివాస్.
కూరగాయలు, పాలతో మస్తు ఆమ్దానీ..
ఐదేళ్ల నుంచి వరి సాగుచేస్తున్నా. అది పశువుల మేత కోసమే. కూరగాయ పంటల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు. బీర, కాకర పంటలతో ప్రతీసారి ఖర్చులన్నీ పోను ఎకరానికి రూ.1.50 లక్షలు (ధర మంచిగుంటే) లేకుంటే రూ.50 వేలు మాత్రం ఎక్కడికీ పోవు. టమాట సాగుపై 60 నుంచి 70వేలు గిట్టుబాటు అయితాంది. మినీ డెయిరీతో మంచి ఆదాయం వస్తోంది. గొర్రెల పెంపకం ద్వారా ఏడాదికి రూ.4 నుంచి 5 లక్షలు వస్తున్నయ్. వరి వేసే బదులు తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో కూరగాయల సాగుచేసి ఎక్కువ లాభాలు పొందవచ్చు.
గొర్రెల పెంపకంతో రూ.2లక్షలు
గొర్రెల పెంపకం చేపట్టి వంద గొర్రెలను ఏర్పాటుచేసుకున్నాడు. సంవత్సరానికి మూడు ఈతల్లో ఉత్పత్తి అవుతుండడంతో ప్రతి ఆరు నెలకోసారి గొర్రెలను విక్రయిస్తున్నాడు. ఖర్చులన్నీ పోను రూ.2 లక్షలు మిగుల్తున్నయ్. ఇలా తనకు ఉన్న స్థలంలో మూడు మార్గాల ద్వారా లాభాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
డెయిరీతో రూ.40వేలకు పైగా..
ఇటు వ్యవసాయమే కాదు.. ప్రత్యామ్నాయ ఆదాయంతో పాటు, ఎరువుల కోసం ఓ మినీ డెయిరీనే ఏర్పాటుచేశాడు శ్రీనివాస్. ఇందుకోసం ఓ షెడ్డు వేసి అందులో 2 బర్రెలు, 10 ఆవులను పెంచుతున్నాడు. డెయిరీ ద్వారా పాల ఉత్పత్తి చేస్తూ ప్రతి నెలా రూ.30 నుంచి 40వేల దాకా సంపాది స్తున్నాడు. పశువుల మూత్రం, పశువులను కడిగే నీటిని కాల్వలు ఏర్పాటు చేసి పంట పొలాల్లోకి తరలిస్తున్నాడు.