జనగామ : జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి (Valmidi ) లో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు శుక్రవారం వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, శ్రీ లక్ష్మీ సహిత శ్రీ విష్ణు సహస్రనామ, రామ రక్షా స్తోత్ర పారాయణాదులు జరిగాయి.
గోపూజ, ప్రతిష్ట అనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రక్షా బంధనము, ఋత్విక్కరణమ్, దీక్ష వస్త్రాధారణ, అంకురారోపణం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు వాల్మీకి పురం వల్మీడి గ్రామంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి (Sita Ramachandra Swamy) వారి పురాతన దేవాలయం నుంచి స్వామి వారి విగ్రహాన్ని మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా రాముల వారి గుట్టపైకి తీసుకు వచ్చారు. అనంతరం స్వయంభూ పాత దేవాలయంలో కి తీసుకెళ్లి పూజాదికాలు నిర్వహించారు. ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఈనెల 4 వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు, కుటుంబ సభ్యులు, పాలకుర్తి శ్రీ సోమేశ్వర, లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, కార్య నిర్వహణ అధికారిణి లక్ష్మీ ప్రసన్న, వల్మీడి దేవస్థాన చైర్మన్ జై హింద్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.