వడ్లు కొనాలని అడిగితే కావురపు మాటలా?
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తరా?
నాడు ఉన్నదో లేనిదో తిన్నం..
నేడు నలుగురికి అన్నం పెడుతున్నం
ఇప్పుడు నూకల బువ్వ తినాల్సిన దుస్థితి లేదు
చిల్లర మాటలు మాట్లాడితే సహించం
మీ బీజేపీ రాష్ట్ర నాయకులు నూకలే తింటరా?
గోయల్ క్షమాపణ చెప్పాల్సిందే..
ధాన్యాన్ని కేంద్రం బరాబర్ కొనాల్సిందే
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై రైతులు, వృద్ధుల గరంగరం
వరంగల్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) :యాసంగి ధాన్యం కొనాలని తనను కలిసిన తెలంగాణ మంత్రులతో ‘మీ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన కారెడ్డం మాటలపై రైతులు, వృద్ధులు భగ్గుమంటున్నరు. ‘అవును.. ఒకనాడు కరువుల ఉన్నదో లేనిదో తిన్నం.. గడ్కనో.. నూకల బువ్వనో తిని బతికినం.. ఇప్పుడు సీఎం కేసీఆర్ చలవతోని తెలంగాణల మేమే నలుగురికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగినం. నూకలు తిన్నా, బియ్యం తిన్నా మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నం.. ఇసొంటి కావురం మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అంటూ మండిపడుతున్నరు. తెలంగాణలో పండిన వడ్లను కేంద్రం బరాబర్ కొనాలని, లేదంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నరు. ‘ఇక్కడ మీ బీజేపీ రాష్ట్ర నాయకులు నూకల బువ్వనే తింటరా?’ అని నిలదీస్తున్నారు.
తెలంగాణ రైతులను నిండా ముంచేలా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై అన్నదాతలు మండిపడుతున్నారు. వరి రైతుల ఇబ్బందులను పరిష్కరించాల్సింది పోయి అహంకారపూరితంగా వ్యవహరిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని కోరిన తెలంగాణ మంత్రులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన తీరుపై రైతులు, వృద్ధులు భగ్గుమంటున్నారు. యాసంగి వడ్లలో నూకలు ఎక్కువ ఉంటాయని, వాటిని తెలంగాణ ప్రజలు తినేలా అలవాటు చేయండని చులకనగా మాట్లాడిన కేంద్ర మంత్రి గోయల్ వెంటనే క్షమాపణ చెప్పాలని రైతులు, రైతు సంఘాల నేతలు, రైతు కూలీలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు మేలు చేయాల్సింది పోయి అవమానించేలా మాట్లాడడం తగదని హితవు పలికారు.
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు వరి వేసుకోండి గింజ పొల్లు పోకుండా కొనిపించే బాధ్యత మాదే అని ప్రకటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రమే తొండి చేస్తున్నదని, దీనికి బాధ్యత వహిస్తూ బండి తన ఎంపీ పదవికి, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లపై రెండేళ్లుగా ఆంక్షలు పెడుతూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం యాసంగిలో పూర్తిగా వడ్లు కొనే పరిస్థితి లేకుండా చేస్తున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన చేయూతతో వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెంది, తెలంగాణలో వరి సాగు అనూహ్యంగా పెరిగిన సమయంలో రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి కేంద్రం ఇలా కక్ష సాధింపు చర్యలు దిగడం సమంజసం కాదని హితవు పలుకుతున్నారు.
గిట్నే చేత్తె.. బీజేపీ పేరుకు లేకుంట అయితది..
వర్ధన్నపేట, మార్చి 25 : తెలంగాణ ప్రజలు, రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తక్కువ చేసి మాట్లాడుడు మంచి పద్ధతికాదు. తొందర్లోనే కేంద్ర ప్రభుత్వానికి మన రైతులు, ప్రజలు గట్టిగ బుద్ధి చెప్తరు. సమైక్యపాలకుల వివక్షతో తెలంగాణ వెనుకబడిందే తప్ప.. ఇక్కడ సంపదకు కొదువలేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో ముందుకు వెళ్తోంది. సరిపడా నీళ్లు వస్తున్నయ్. పెట్టుబడి సాయం అందుతాంది. అందుకే రైతులు పంటలు మంచిగ పండించుకొని సంతోషంగా ఉన్నరు. ప్రజలు కూడా ఇదివరకు లెక్క కాకుంట మంచి తిండి తింటున్నరు. కానీ కేంద్ర మంత్రి మాత్రం తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలనడంలో అర్థం ఏమిటి? నాడు కరువు ఉన్నప్పుడు నూకలు, గడ్క తిన్నం. ఇప్పుడు మాకేం ఖర్మ. మా తెలంగాణ ప్రభుత్వం అన్నీ ఇచ్చింది. ఇప్పుడు మంచిగ పంటలు పండించుకుంటానం. మంచి తిండి తింటానం. అన్నితీర్ల మంచిగ అయినమని కావచ్చు.. కేంద్రంల ఉన్నోళ్లు కండ్లమంటతోటి ఉన్నట్టున్నరు. తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టేందుకు వడ్లను కొనమంటాన్రు. దీని మీద సీఎం ఒక్క పిలుపు ఇస్తే చాలు కేంద్రం మీద పోరాటం చేసేందుకు రైతులు, ప్రజలు, కూలీలు సిద్ధంగ ఉన్నరు. గిట్ల నోటికచ్చింది మాట్లాడుడు బంద్చేసి వడ్లను మొత్తం కొనాలె. లేకుంటె బీజేపీ పేరుకు లేకుంట పోతది. – అల్లమనేని మోహన్రావు, రైతు, వర్ధన్నపేట
ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి..
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయాలని మాట్లాడి కించపరిచారు. ఇక్కడి ప్రజలు నూకలు తిన్న రోజుల్లో పరిస్థితులు వేరు. అప్పట్లో తెలంగాణలో నీటి వనరుల్లేవు. కరెంటు లేదు, విత్తనాల్లేవు. చేతినిండా పని ఉండేది కాదు. పంటలు పండే అవకాశం లేక ఒక దశలో నూకలు దొరకడం కూడా కష్టంగ ఉండేది. కానీ ఇప్పుడు ప్రజల జీవన విధానంలో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ విపరీతమైన నీటి వనరులు పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. 24గంటల నాణ్యమైన కరెంటు సరఫరా, కొత్త వంగడాలొచ్చినయ్. హైబ్రీడ్ విత్తనాలు దొరుకుతున్నయ్. ఎరువులకు రంది లేదు. పంటలు పుష్కలంగ పండుతున్నయ్. అధిక దిగుబడులొస్తున్నయ్. చేతినిండా పని ఉంటాంది. చేసేటోళ్లుంటే ఏడాది పొడవునా పనికి ఢోకాలేదు. కడుపునిండా తిండి దొరుకుతున్నది. దీనికి సంతోషించాల్సిందిపోయి కేంద్ర మంత్రి గోయల్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం పద్ధతికాదు. ఇంత అహంకారం పనికిరాదు. ప్రజలు మానసికంగా క్షోభకు గురయ్యేలా మాట్లాడారు. ఆత్మగౌరవాన్ని వంచించుకొనేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగ లేరు. తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? గోయల్ అలా అనడం సరైంది కాదు. ఆయన స్థాయికి తగిన మాటలు కాదు. గోయల్ వెంటనే తన వ్యాఖ్యలను వాపస్ తీసుకోవాలి.
– కూసం రాజమౌళి, మాజీ సర్పంచ్, గంగదేవిపల్లి
తక్కువ చేసుడు పద్ధతి కాదు.. క్షమాపణ చెప్పు
నర్సంపేట రూరల్, మార్చి 25: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గింత దుర్మార్గంగా మాట్లాడుడు పద్ధతి కాదు. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి గాకముందు తెలంగాణల ఇన్ని నీళ్లు ఎక్కడియి? గీ కమాన పంటలు పండినయా? చెరువుల్ల సూద్దామంటే నీళ్లు ఎక్కడ్నో అడుగుకు కనిపించేటియి. నాడు అంత కరువు ఉండేది. గప్పుడు బియ్యం దొర్కక నూకల అన్నం తిని బతికినం. ఇయ్యాల తెలంగాణ కేసీఆర్ దయ వల్ల పచ్చవడ్డది. ఎవుసానికి సరిపోను నీళ్లు, 24గంటల కరెంటు, ఎరువులు, పురుగు మందులు ఇత్త్తాండు. చెరువులు, కుంటల్ల నీళ్లు పుష్కలం ఉన్నయ్. పెద్ద పెద్ద ప్రాజెక్టు కట్టి రంది లేకుంట జేసుట్ల అన్ని తీర్ల పంటలు మస్తుగ పండుతున్నయ్. గిప్పుడు నూకల బువ్వ తినుమంటే ఎట్లా సారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలను గిట్ల తక్కువ జేసి మాట్లాడుడు మంచిది కాదు. నూకల బువ్వ తినే రోజులు పోయి సన్న బువ్వ తినే రోజులు కేసీఆర్ సార్తోనే వచ్చినయ్. కేంద్ర మంత్రి తప్పును ఒప్పుకొని రైతులకు వెంటనే క్షమాపణ జెప్పాలి. లేకపోతే రైతు ల ఉసురు మోడీ స ర్కారుకు తప్పక తగుల్తది.
మేమెందుకు తింటం..
ములుగు, మార్చి 25(నమస్తే తెలంగాణ) : నాకు ములుగు రంగారావుపల్లి కాడ రెండు ఎకరాల భూమి ఉన్నది. నేను వ్యవసాయం చేసినప్పటి నుంచి వరి పంటనే పండిత్తాన. నా చిన్నతనంలో మా నాయిన వ్యవసాయం చేసినప్పుడు ఇంతగనం వడ్లు పండకపోయేది. ఏడు, ఎనిమిది ఏండ్ల కాన్నుంచి రెండు పంటలు వరే సాగుచేత్తాన. ఎన్కటి రోజుల్ల నీళ్ల సౌలత్ లేక వడ్లు కొన్నే పండించేది. నాడు ఎకరాన 15-20 బత్తాలే వచ్చేటియి. ఇప్పుడు 30నుంచి 40 బత్తాలు పండుతానయ్. మా చిన్న తనాన పండుగకో, పబ్బానికో వరి అన్నం తినేటోళ్లం. కానీ పదేండ్ల సంది కాలం మంచిగ అయితాంది. చెర్లు, కుంటలు నిండుగ ఉంటానయ్. యాసంగి, వానకాలంల వరి పంటనే పండిత్తానం. నూకల అన్నం అయితే ఏనాడు సుత తినలే. కాకపోతే పజ్జొన్న గడక మాత్రం చిన్నతనంలో తిన్న అలవాటుతో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు గడుక తింటాం తప్పితే నూకల అన్నం నా జీవితంలో ఏనాడూ తినలే.
– గోపు ఓదేలు,రైతు,ములుగు
కండ్లకు కనవడ్తలేమా?
మహబూబాబా ద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఎనుకట కాలం కాక వేసిన పంటలు ఎండిపోయి తిండి గింజలు దొరుకుడు మస్తు కష్టమయ్యేది. నా చిన్నతనాన తిందామంటే ఏం దొరికేది కాదు. నాకు వందేండ్లు ఉంటయ్. నాడు ఓ పూట గడ్క తిని రోజంతా ఉండేది. గడ్క లేని నాడు మక్కజొన్న రొట్టెలు తిని బతికనం. ఒకపూట గడ్క దొరికితే అదే పరమాన్నం అనుకునేది. ఒక రోజు గడ్క, ఇంకోరోజు రొట్టె తినేది. అటెంక గొట్టు వడ్ల అన్నంతోటి సజ్జలు కలిపి తిన్న. ఇప్పుడు బియ్యం అన్నం తింటున్న. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు పంటలకు నీళ్లు వస్తున్నయ్. వడ్లు కూడ బాగా పండుతున్నయ్. సీఎం కేసీఆర్ రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నడు. ఇప్పుడు వడ్లు పుష్కలం పండుతానయ్. గింత మంచిగ ఉన్నంక గా కేంద్ర మంత్రి మనల నూకలు తినుమని చెప్పుడేంది. ఇది పద్ధతేనా? ఇది తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టే. ఎన్కట ఏదుంటె అది తిని బతికిన. తెలంగాణ ప్రజల బతుకులను ఎగతాళి చేయడం సరికాదు. ఇప్పటికైనా ఆయన అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ రైతులు, రైతు కూలీలు, తెలంగాణ ప్రజలను తక్కువజేసుడు అహంకారమే.
– భైరి వీరయ్య, రైతు, వావిలాల, మహబూబాబాద్
బీజేపీ ఆఫీస్ ఎదుట ధాన్యం
-ఎడ్లబండిలో తీసుకెళ్లి పోసి టీఆర్ఎస్ నాయకుల నిరసన
ఖిలావరంగల్, మార్చి 25 : తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనేదాక పోరాడుతామని వరంగల్ మహానగర పాలక సంస్థ మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు, టీఆర్ఎస్ నాయకులు రాజనాల శ్రీహరి స్పష్టం చేశారు. శుక్రవారం ఎడ్ల బండిపై ధాన్యం బస్తాలను తీసుకెళ్లి శివనగర్లోని బీజేపీ కార్యాలయం ఎదుట పోసి నిరసన తెలిపారు. వడ్లను కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు. పండించిన పంటలు కొనుగోలు చేయకుండా రైతులను బీజేపీ సర్కారు ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. పంజాబ్లో రెండు పంటలను ఎఫ్సీఐ ద్వారా కేంద్రమే కొనుగోలు చేసినట్లు తెలంగాణలో కూడా కొనాలన్నారు. రైతును రాజు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ అహర్నిశలూ కష్టపడుతుంటే కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బండ్ల సురేందర్, పవన్, శివపటేల్, బుర్రి ప్రకాశ్, మాగంటి శివకుమార్, రామ్చందర్ పాల్గొన్నారు.