మహాముత్తారం : పోలీసులు ప్రజలతో మమేకం కావాలని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవనం గడిపేలా పోలీసులు పని చేయాలన్నారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కాటారం డీఎస్పీ బోనాల కిషన్, సీఐ హథీరాం, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు..
కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ పర్యటించారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎస్పీకి స్వాగతం పలికారు. ఆలయంలోని గణపతి వద్ద పూజలు, స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేకాభిషేకాలు చేశారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్ర్తాలను ఎస్పీకి అందించారు. హరిత హోటల్ ఎదుట మేనేజర్ జక్కం సురేశ్తో కలిసి మొక్కలు నాటారు. హోటల్ ఎదుట చేపట్టిన కొత్త పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని గుత్తేదారుకు సూచించారు. ఆయన వెంట డీఎస్పీ బొనాల కిషన్, సీఐ కిరణ్, ఎస్సై బాలకృష్ణ తదితరులు ఉన్నారు.