జనగామ(నమస్తే తెలంగాణ)/జఫర్గడ్, ఆగస్టు 26: ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు రోజు శుక్ర వారం జఫర్గడ్ మండలం కూనూరులో కాషాయ మూక దాడులకు తెగబడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబాన్ని దుర్భాషలాడడాన్ని తట్టుకోలేని టీఆర్ఎస్ కార్యకర్త చాగంటి రాజు ‘జై కేసీఆ ర్’..‘బండి గోబ్యాక్’ అంటూ నినాదం చేసినందుకు కాషాయ కండువాలు కప్పుకున్న గూండాలు కాళ్లతో తొక్కుతూ విచక్షణారహితంగా చితకబాదారు. పోలీసులు లాఠీచార్జి చేసి నిలువరించినా కాషాయ కండువాలు కప్పుకున్న బౌన్సర్లు, రౌడీలు, గూండాలు అడ్డుకొని స్పృహ కోల్పోయే దాకా కొట్టారు. చాగంటి రాజును పోలీసులు చికిత్స కోసం జనగామ జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. దీంతో కూనూరులో గంటపాటు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో యాత్రను ప్రారంభించిన రోజునే దేవ రుప్పులలో బౌన్సర్లతో టీఆర్ఎస్ కార్యకర్తలు, సామాన్యులపై దండయాత్ర చేసిన బండి మూక మొన్న జఫర్గడ్ మండలం పాంనూర్లో, శుక్రవారం కూనూరులో అదే తరహా దాడులతో రెచ్చిపోయారు.
ప్రశ్నిస్తే దాడులా..
జనగామ రూరల్: ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్ర కాదు.. గూండాల యాత్ర అని జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం కునూరు గ్రామంలో బీజేపీ నాయకుల దాడిలో గాయపడిన టీఆర్ఎస్ కార్యకర్త చాగంటి రాజును జనగామ ప్రభుత్వ ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్ సుమారు 500 మంది గూండాలతో పాదయాత్ర నిర్వహిస్తున్నారని విమర్శించారు. కేంద్రం నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో సామాన్యులు నిలదీస్తుండగా గూండాలతో దాడులు చేయిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలపై రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడులు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ విషయమై విచారణ జరిపి దోషులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో సానుభూతి పొందడానికే బీజేపీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో లింగాలఘనపురం ఎంపీపీ జయశ్రీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సేవెల్లి సంపత్, దిశ సభ్యురాలు భాగ్యలక్ష్మి, టీఆర్ఎస్ నేతలు ఉన్నారు.