జనగామ, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఈనెల 11న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కార్యక్రమాలు, బహిరంగ సభా స్థలాన్ని వారు రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, దివ్యాంగుల సంస్థ చైర్మన్ వాసుదేవరెడ్డితో కలిసి ఆదివారం పరిశీలించారు. హన్మకొండ హైవేలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, జనగామ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం వద్ద సీఎం బహిరంగసభ వేదిక ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈసందర్భం గా మంత్రులు మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేసి సీఎం పర్యటనను విజయవంతం చేయాలన్నారు. టీఆర్ఎస్ భవన్ పక్కన, ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాలను మంత్రు లు పరిశీలించి బహిరంగసభ, పార్కింగ్ కోసం ఏర్పాట్లపై సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయంలోని అన్ని ప్రభుత్వ విభాగాలను, ఆతర్వాత పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడే నిర్వహించే బహిరంగసభలో మాట్లాడుతారని పేర్కొన్నారు. జనగామ, పాలకుర్తి, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో బహిరంగసభకు జనసమీకరణ చేయాలని, అందుకోసం నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలవారీగా ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు సమష్టిగా పనిచేయాలని సూచించారు. సభా వేదిక అలంకరణ, వసతుల కల్పన, జనసమీకరణ, వాహనాల పార్కింగ్, హాజరయ్యే ప్రజలు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే ఏర్పాట్లను చర్చించారు. వీవీఐపీలు, వీఐపీలు, మీడియా, పోలీసులు, అధికారులు సహా జనాన్ని తరలించే వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ కోసం ఏర్పాట్లు పక్కాగా ఉండాలని మంత్రులు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటన ఖరారైనందున కొత్త కలెక్టరేట్ పెండింగ్ పనులను రాత్రింబవళ్లు పనిచేయించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు.
సీఎం కేసీఆర్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు : కలెక్టర్ శివలింగయ్య
జనగామ చౌరస్తా : జనగామలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం ఈనెల 11న ఉదయం 11 గంటలకు ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ వస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య తెలిపారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీఎం జిల్లా పర్యటనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలతో స్వాగతించాలని చెప్పారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కళాకారులతో, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతితో రెవెన్యూ శాఖ అధికారులు స్వాగతం పలకాలని చెప్పారు. మైక్ల ఏర్పాట్లను జిల్లా పంచాయతీ శాఖ అధికారులు పర్యవేక్షించాలన్నారు. వీఐపీలకు భోజన ఏర్పాట్లను అదనపు కలెక్టర్ ఏ భాస్కర్రావుకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ఏ భాస్కర్రావు, అబ్దుల్ హమీద్, జిల్లా వైద్యాధికారి మహేందర్, జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవోలు మధుమోహన్, కృష్ణవేణి, డీఆర్డీవో రామ్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, జనగామ తహసీల్దార్ రవీందర్, మున్సిపల్ కమిషనర్ నరసింహ, ఇంజినీరింగ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.