జనగామ చౌరస్తా, ఏప్రిల్ 21 : ఎండాకాలంలో వేడిని ‘నిమ్మ’ చల్లార్చేలా లేదు. గతేడాది కురిసిన అకాల వర్షాల కారణంగా పూత రాలిపోయి దిగుబడి చాలా వరకు తగ్గింది. దీంతో మార్కెట్లో ధర రోజురోజుకూ పెరుగుతూ పోతున్నది. చిన్న సైజు నిమ్మకాయలు పదిరూపాయలకు రెండే ఇస్తున్నారు. పెద్ద కాయలైతే ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.15వరకు చేరి సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. నిమ్మకాయల తొక్కు పెట్టుకోవాలన్నా, కనీసం ‘షర్బత్’ చేసుకోవాలన్నా, పేద-మధ్యతరగతి వారికి ఇబ్బందికరంగా మారింది. కనీసం నిమ్మకాయ పులిహోర చేసుకుందామన్నా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అసలే ఎండాకాలం.. దూర ప్రయాణం చేసేవారు మార్గమధ్యంలో నిమ్మరసంతో సేదతీరాలనుకున్నా జేబుకు చిల్లుపడాల్సిందే.. ఇక బజ్జీల బండి నుంచి బిర్యానీ హోటళ్లలో ఉల్లిగడ్డ ముక్కలు పెడుతున్నారు గాని, నిమ్మకాయలకు నీళ్లొదిలారు. రసం లేని నిమ్మకాయలు కూడా సిమెంట్ సంచికి రూ.1000, రసం ఉన్న కాయలు రూ.2వేల వరకు ధర పలుకుతున్నాయి. ఒక్కో సంచిలో సుమారు 600-700 కాయలు మాత్రమే ఉంటున్నాయి. దీన్ని బట్టి ప్రస్తుతం నిమ్మకు ఎంత రేటు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు రూపాయి, రెండు రూపాయలకు ఒక కాయ చొప్పున వచ్చేది. ఇప్పుడు అమాంతం రూ.10కి చేరడంతో కొందామంటేనే అందరూ ‘అమ్మో.. నిమ్మ’ అంటున్నారు. ప్రస్తుత ఏప్రిల్ సమయానికి కాయలు కోతకు రావాల్సి ఉన్నా ఎక్కడా పూత, కాత లేదు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట, కొడకండ్ల మండలాల్లో అత్యధికంగా 100 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగవుతున్నా జనగామకు ఎక్కువగా నల్లగొండ, నకిరేకల్ వంటి ప్రాంతాల నుండి తెచ్చి విక్రయిస్తున్నారు.
కొనలేకపోతున్నం
ఎండా కాలం వచ్చిందంటే ఇంట్లో వంద నిమ్మకాయలతో తొక్కు పెట్టుకునేది. అలాంటిది ఇప్పుడు పిల్లలకు కనీసం పులిహోర చేసి పెడుదామన్నా, బడి నుంచి ఇంటికి రాగానే షర్బత్ చేసి పోద్దామన్నా నిమ్మకాయల ధర బాగా పెరిగి కొనలేకపోతున్నం. నిమ్మకాయలు ముట్టుకుందామంటేనే భయమనిస్తున్నది.
– మేకల జ్యోతి, గృహిణి, జనగామ