పోచమ్మమైదాన్, ఏప్రిల్ 15 : వరంగల్ సెంట్రల్ జైలులో విక్రయిస్తున్న మాస్కులకు రోజురోజుకూ గిరాకీ పెరుగుతోంది. ఇప్పటికే కారాగారంలో ఖైదీలు తయారు చేసిన మాస్కులకు డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం మరింత అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్కులు కొనుగోలు చేయడానికి ప్రజలు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా బయట మార్కెట్లో లభిస్తున్న మాస్కుల కన్నా సెంట్రల్ జైలులో తయారు చేస్తున్న వాటిపై ప్రజలు మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతినెలా మాస్కుల అమ్మకాలు రెట్టింపవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో 10,215, ఫిబ్రవరిలో 2,760, మార్చిలో 12వేల మాస్కులు విక్రయించగా, ఏప్రిల్ నెలలో పదిహేను రోజులకే 8వేలకు పైగా మాస్కులు అమ్ముడు పోయినట్లు జైలు సూపరింటెండెంట్ సంతోష్కుమార్ రాయ్ తెలిపారు. ప్రజల డిమాండ్కు అనుగుణంగా మాస్కులను తయారు చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే, మాస్కులతో పాటు ఫినాయిల్ అమ్మకాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మూడువేల లీటర్ల చొప్పున అమ్మకాలు జరుగగా, మార్చిలో నాలుగు వేల లీటర్లు దాటిందని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్