దుగ్గొండి, మే 19: జిల్లాలో ఈ నెల 23న ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖాధికారి వాసంతి సూచించారు. మండలకేంద్రంతోపాటు మల్లంపల్లి హైస్కూల్లో ఏర్పాటు చేసిన రెండు పరీక్ష కేందాల్రను గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో వసతులను పరిశీలించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులతో మాట్లాడి వారికి సూచనలు, సలహాలు అందించారు. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సీసీ కెమెరాలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో దుగ్గొండి, మల్లంపల్లి పరీక్ష కేంద్రాల సీఎస్లు, డీవోలు ఎండీ రజాక్, సంపత్రావు, ప్రవీణ్కుమార్, ప్రభాకర్, ఎంఈవో చదువుల సత్యనారాయణ పాల్గొన్నారు.
పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నల్లబెల్లి/గీసుగొండ: పదో తరగతి పరీక్షలకు మండలంలోని పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయినట్లు డీఈవో వాసంతి తెలిపారు. నల్లబెల్లి మండలకేంద్రం, రుద్రగూడెంలోని పరీక్ష కేంద్రాలను ఆమె పరిశీలించారు. మండలంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండలకేంద్రంలోని పీఎస్లో 82, జడ్పీహెచ్ఎస్లో 140, రుద్రగూడెం జడ్పీహెచ్ఎస్లో 150 మంది కలిసి మొత్తం 372 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు ఆమె వెల్లడించారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. డీఈవో వెంట ఎంఈవో చదువుల సత్యనారాయణ, డీవోలు నాగేశ్వర్రావు, వెంకన్న ఉన్నారు. అలాగే, గీసుగొండ మండలంలోని ధర్మారం, గీసుగొండ జడ్పీహెచ్ఎస్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను డీఈవో పరిశీలించారు. మౌలిక వసతులు కల్పించాలని, ప్రశ్నపత్రాలను ఓపెన్ చేసే ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆమె వెంట ఎంఈవో సత్యనారాయణ, హెచ్ఎం సుజాత ఉన్నారు.
పరీక్ష కేంద్రాల పరిశీలన
ఖానాపురం: మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టెన్త్ పరీక్ష కేంద్రాన్ని ఎంఈవో రత్నమాల పరిశీలించారు. ఈ సందర్భంగా భవనాలను కలియతిరిగి సౌకర్యాలను తెలుసుకున్నారు. ఈ నెల 23న పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నందున ఖానాపురం జడ్పీహెచ్ఎస్, బుధరావుపేట మోడల్ స్కూల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఖానాపురంలో 109, బుధరావుపేటలో 160 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంఈవో వెంట హెచ్ఎం రాజేందర్, మురళి ఉన్నారు. కాగా, ఖానాపురం పాఠశాల ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈవో తెలిపారు.