జనగామ: మండలంలోని పలు పాఠశాలలను డీఈవో రాము శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వడ్లకొండ, ఓబుల్ కేవ్వాపూర్, సిద్దెంకి పాఠశాలలను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పాఠశాలలకు ఉపాధ్యాయులు సమయానికి చేరుకోవాలని, విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించాలన్నారు. అవసరం అయ్యే పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయిస్తామన్నారు.
పాఠశాలల్లో నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంకరి నిర్మల, ఎస్ఎంసీ చైర్మన్ మడిపల్లి సుధాకర్ గౌడ్, ఉపాధ్యాయులు రాజ్ కుమార్, శ్రీనివాస్, మనోజ్ కుమార్, అనిత, శ్రీలత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.