అధికారుల తీరుపై సభ్యుల మండిపాటు
పారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలి
జనగామ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పలువురి డిమాండ్
జనగామ చౌరస్తా, అక్టోబర్ 30 : అభివృద్ది పనుల్లో నాణ్యతాలోపానికి తోడు అధికారుల నిర్లక్ష్యంపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జనగామ మున్సిపల్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ పోకల జమున అధ్యక్షతన జరిగింది. పట్టణంలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ఏజెండా అంశాలుండగా సమావేశ ప్రారంభంలోనే సంబంధిత శాఖల అధికారులందరూ సమావేశానికి హాజరుకాలేదని కాంగ్రెస్ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బీజేపీ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్రగుప్త మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో ప్రధాని మోదీ నేతృత్వంలో వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతున్నదని ప్రస్తావిస్తుండగా, దీనిని కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం 1వ వార్డు కౌన్సిలర్ రామగల్ల అరుణ మాట్లాడుతూ తన వార్డులో వీధి దీపాలు, డ్రైనేజీ సమస్యల గురించి ప్రస్తావించారు. 2వ వార్డు కౌన్సిలర్ వాంకుడోత్ అనిత మాట్లాడుతూ హన్మకొండ రోడ్డు మార్గంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎదురుగా ఉన్న శ్మశాన వాటికతో పాటు ప్రెస్టన్ స్కూల్ ఆవరణలోని శ్మశాన వాటికలకు మౌలిక వసతులకు, రోడ్లు వేయడానికి నిధులు కేటాయించాలని కోరారు.
4వ వార్డు కౌన్సిలర్ మంత్రి సుమలత మాట్లాడుతూ తన వార్డులో డ్రైనేజీ సమస్యల గుర్తించి ప్రస్తావించగా, 5వ వార్డు కౌన్సిలర్ దేవరాయ నాగరాజు మాట్లాడుతూ తన వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజిలను ఏర్పాటు చేయాలని కోరారు. 6వ వార్డు కౌన్సిలర్ వంగాల కల్యాణి మాట్లాడుతూ తన వార్డు పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉన్నందున పారిశుధ్య పనుల్లో జాప్యం ఉందన్నారు. దీని నివారణకు పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. 7వ వార్డు కౌన్సిలర్ మల్లవరం అరవింద్రెడ్డి మాట్లాడుతూ తన వార్డులో డ్రైనేజీ సమస్యలను వివరించారు. 9వ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల చందర్ మాట్లాడుతూ గాంధీనగర్ ఏరియాలో అసంపూర్తిగా ఉన్న శ్మశాన వాటిక పనులను పూర్తి చేయాలన్నారు. 10వ వార్డు కౌన్సిలర్ నీల శ్రీజ మాట్లాడుతూ తన వార్డులో అంగన్ వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు కమ్యూనిటీ హాలు నిర్మించాలని కోరారు. 11వ వార్డు కౌన్సిలర్ పాక రమ మాట్లాడుతూ రైల్వే చిన్న మోరీ సమస్యను పరిష్కరించాలని కోరారు. పాత ఆంధ్రా బ్యాంకు ఏరియా నుంచి వ్యవసాయ మార్కెట్కు వెళ్లే దారిలో నిత్యం లారీలు ఇతర వాహనాల రాకపోకలు సాగిస్తుండడం, అక్కడే ఓ ప్రైవేటు పాఠశాల ఉండడం, రోడ్డు ఇరుకుగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే అక్కడ రోడ్డు వెడల్పు చేయాలని కోరారు. కాళోజి విగ్రహం వద్ద కల్వర్టు సమస్య ఉందని పేర్కొన్నారు. 12వ వార్డు కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మి మాట్లాడుతూ తన వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మెనూ చార్జీలు ఒక్కో విద్యార్థికి రూ.15 నుంచి రూ.20కి పెంచాలని కోరారు. 13వ వార్డు కౌన్సిలర్ మల్లిగారి చంద్రకళ మాట్లాడుతూ తన వార్డులో నీటి సమస్యను వివరించారు.
శ్మశానవాటికకు నిధుల కేటాయింపుపై హర్షం
17వ వార్డు కౌన్సిలర్ జక్కుల అనిత మాట్లాడుతూ గుండ్లగడ్డ శ్మశాన వాటికకు రూ.10 లక్షలు కేటాయించడం హర్షించదగిన విషయమన్నారు. ఈ సందర్భంగా 29వ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల దయాకర్ జోక్యం చేసుకుంటూ తన వార్డుకు సంబంధించిన విషయమని, తన వార్డు పరిధిలోకి వచ్చే శ్మశానవాటిక అంశాన్ని ఎజెండాలో మీ వార్డు పరిధిలో ఎలా చేర్పిస్తారని అనితను ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మారబోయిన పాండుకు టీఆర్ఎస్ కౌన్సిలర్ దయాకర్కు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా పాండు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి బైఠాయించారు. దయాకర్ కాంగ్రెస్ సభ్యుల తీరును నిరసించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ జోక్యం చేసుకుని ఇరువురిని సముదాయించారు. అనంతరం తిరిగి సభా యథావిధిగా కొనసాగింది.
వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి : అబ్దుల్ హమీద్
జిల్లాతో పాటు మున్సిపల్ పరిధిలో ఉన్న 30 వార్డుల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసేందుకు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ కోరారు. అనంతరం సభ్యులు ఎజెండా అంశాలను చర్చిస్తుండగా గుండ్లగడ్డ శ్మశానవాటిక అంశాన్ని వచ్చే కౌన్సిల్ సమావేశం వరకు వాయిదా వేయాలని టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ తాళ్ల సురేశ్రెడ్డి, 29వ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల దయాకర్ చైర్మన్ను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతూ దానిని ఆమోదించాలని, లేదంటే తటస్థంగా ఉంచాలి తప్ప వాయిదా వేయొద్దని కోరారు. ఎజెండాలో పొందుపర్చిన పారిశుధ్య, అభివృద్ధి ప నులకు సంబంధించిన 24 అంశాలతో పాటు మరో మూడు అదనపు ఎజెండా అంశాలు సభ్యులందరి ఆమోదం పొందాయని మున్సిపల్ కమిషనర్ కే నర్సింహ పేర్కొన్నారు.