జనగామ చౌరస్తా, అక్టోబర్ 29 : కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ధరణి పోర్టల్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహంచారు. రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, ధరణి టెక్నికల్ సిబ్బందితో కలిసి కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య కేకుకట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకే దగ్గర భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అనే వినూత్న కార్యక్రమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలో ధరణి పోర్టల్ను గతేడాది అక్టోబర్ 29న ప్రారంభించినట్లు తెలిపారు. ధరణి సాఫ్ట్వేర్ ద్వారా ఎదురయ్యే భూ సమస్యల్నీ ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో సీఎస్ సోమేశ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబర్ 29 శుక్రవారం రోజుకు ధరణి పోర్టల్ ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ధరణి పోర్టల్లోని గ్రీవెన్స్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్ (భూమి హక్కుదారు పేరు, ఆధార్ కార్డు వివరాలు, డిజిటల్ సైనింగ్, ఇతర తప్పులను) సరిచేసే విషయంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానాన్ని పొందడం గర్వించదగ్గ విషయమని కలెక్టర్ శివలింగయ్య పేర్కొన్నారు. దీంతో సీఎస్ సోమేశ్ కుమార్ కలెక్టర్, రెవెన్యూ, ఇతర అధికార యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ మెస్సేజ్ చేసినట్లు తెలిపారు. కోర్టు కేసులతో వివాదాల్లో ఉన్న భూముల సమస్యల్నీ పరిష్కరించడంలో జిల్లా రాష్ట్రంలో 2వ ర్యాంకు సాధించిందన్నారు. అదేవిధంగా పెండింగ్ మ్యూటేషన్ల సమస్యల్నీ పరిష్కరించడంలో జిల్లా రాష్ట్రంలో 7వ స్థానాన్ని పొందిందని పేర్కొన్నారు. ఈ విజయానికి జిల్లా రెవెన్యూ, ధరణి టీమ్ సభ్యులందరి సమష్టి కృషితోనే సాధ్యమైందన్నారు.
ఇప్పటి వరకు జిల్లాలో ధరణి పోర్టల్ ద్వారా సేల్, మార్ట్గేజ్, గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు అన్ని కలిపి మొత్తం 21 వేల 556 రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసినట్లు తెలిపారు. వారసత్వ (సక్సెషన్) రిజిస్ట్రేషన్లు 1755 పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా గ్రీవెన్స్ ద్వారా జిల్లాలో 13 వేల 584 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. ఇందులో పెండింగ్ మ్యుటేషన్కు సంబంధించినవి 4952, గ్రీవెన్స్ ఆన్ ల్యాండ్ మ్యాటర్స్కు సంబంధించి 3628, ప్రొహిబిటేడ్ లిస్ట్ 4210, కోర్టు కేసు అండ్ ఇంటిమేషన్కు సంబంధించినవి 794 విజయవంతంగా పరిష్కరించినట్లు తెలిపారు. ఈ ధరణి ఆన్లైన్ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో పూర్తి స్థాయి పారదర్శకత ఏర్పడిందన్నారు. భూ రికార్డులను ఎవరుపడితే వారు మార్పులు, చేర్పులు చేయడానికి ఆస్కారం లేకుండా ట్యాంపర్ ఫ్రీ చేయడం, బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. భూమి రిజిస్ట్రేషన్ కొరకు వారికి నచ్చిన తేదిల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవడం, ఆన్లైన్ పేమెంట్ చేయడం, ఈ విషయంలో ఎవరితో కూడా ఫిజికల్ ఇంటరాక్షన్ లేకుండా చేయడం ఈ ధరణి పోర్టల్ ప్రత్యేకత అన్నారు. ప్రభుత్వ భూములను ఎవరైనా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ధరణి పోర్టల్లో లాక్ చేసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఏ భాస్కర్రావు, జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవోలు మధుమోహన్, కృష్ణవేణి, 12 మండలాలకు చెందిన తహసీల్దార్లు, ధరణి పోర్టల్ టెక్నికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.