మత సామరస్యానికి ప్రతీకగా పీరీల ఊరేగింపు
జనసంద్రంగా మారిన ఓరుగల్లు కోట
ఖిలావరంగల్, ఆగస్టు 20 : హిందూ ముస్లింల ఐక్యతకు, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా సమష్టిగా పీరీలను ఊరేగించారు. డప్పు వాయిద్యాలతో ముందుకు సాగిన పీరీలకు భక్తులు అడుగడుగున నీరాజనాలు పలికారు. హస్సేన్, హుస్సేన్ త్యాగాలను స్మరిస్తూ తొమ్మిది రోజులపాటు పీరీలకు ప్రత్యేక పార్థనలు చేసి దగ్గరలో ఉన్న చెరువులు, బావుల్లో నిమజ్జనం చేశారు.
ఓరుగల్లు కోటలో..
చారిత్రక ఓరుగల్లు కోటలో జరిగిన పీరీల ఊరేగింపునకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మధ్యకోట సదర్చౌక్ భక్షిమహాల్లోని పీరీల కొట్టాల్లో ప్రార్థనలు చేశారు. భక్తులు షర్బత్(మట్కీలు), తీపి ముద్దలు, ఇతర తినుబండారాలను ఫాతియా(నైవేద్యం) ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం నమాజ్ తర్వాత సదర్చౌక్ నుంచి హుస్సేనీ అలం, హస్సే నీ అలం, పంజతన్, భారీ ఇమామ్ పీరీలతోపాటు మరో నాలుగు పీరీలను పడమర కోట మీదుగా ఖమ్మం రోడ్డులోని బావి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. డప్పు చప్పుళ్లతో నృత్యాలతో ఊరేగింపు కొనసాగింది. ముస్లింలతోపాటు హిందువులు సైతం భక్తిశ్రద్ధలతో పీరీలను పూజించారు. కరీమాబాద్, ఉర్సు, చింతల్, శంభునిపేట ప్రాంతాల్లో పీరీలను ఊరేగించారు. మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ ఎదుట గల బావి వద్ద పీరీలను దించి, శుభ్రం చేశారు. అనంతరం వాటిని పెట్టెలో పెట్టి, పీరీల కొట్టానికి తరలించారు.
జనసంద్రమైన ఖిల్లా
మొహర్రం సందర్భంగా ఖిలా వరంగల్ కోట పరిసరాలు జాతరను తలపించాయి. డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్మసూద్, 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు బోగి సువర్ణాసురేశ్, బైరబోయిన ఉమాదామోదర్ యాదవ్తోపాటు ముస్లిం మత పెద్దలు ర్యాలీని ప్రారంభించారు. కాగా, రాత్రి పొద్దుపోయే వరకు కూడా పీరీల ఊరేగింపు వీక్షించేందుకు భారీగా జనం తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మిల్స్కాలనీ పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.