వడ్ల కొనుగోళ్లలో రెండు నాల్కల ధోరణి తగదు
దొంగాట ఆడుతున్న బీజేపీ ప్రభుత్వం
రైతులను తప్పుదోవ పట్టిస్తున్న కేంద్ర మంత్రులు
తొండి మాటలు మాట్లాడుతున్న బండి సంజయ్
విభజన చట్టంలోని హామీల అమలులో విఫలం
పార్లమెంట్లో నోరుమెదపని బీజేపీ ఎంపీలు
నేడు టీఆర్ఎస్ ధర్నాను విజయవంతం చేయాలి
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
పాలకుర్తి రూరల్, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లతోపాటు తెలంగాణ రాష్ర్టానికి చేస్తున్న అన్యాయంపై తాడో పేడో తేల్చుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిసరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం రెండు నాల్కల ధోరణి అవలంబిస్తూ దొంగాట ఆడుతోందన్నారు. కేంద్రంలోని మంత్రులది ఓ మాట ఉంటే.. రాష్ట్రంలోని బీజేపీ నాయకులది మరో మాట ఉందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేశారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం తొండి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను రైతులు ఉరికించాలని పిలుపునిచ్చారు. విభజన హామీలను అమలు చేయడంలోనూ కేంద్రం విఫలమైందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతోపాటు రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్ట్లకు, మిషన్ కాకతీయ పథకాలకు కేంద్రం ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. దీనిపై బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు తెలంగాణ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. కేంద్రంపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారని చెప్పారు. రైతులు యాసంగిలో లాభసాటి పంటలు పండించాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం అన్ని మండలకేంద్రాల్లో నిర్వహించే నిరసన ధర్నా కార్యక్రమాలకు పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్రావు, ఎంపీపీ నల్లానాగిరెడ్డి, దేవస్థానం చైర్మన్ రాంచంద్రయ్యశర్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముస్కు రాంబాబు, రైతుబంధు మండల అధ్యక్షుడు వీరమనేని యాకాంతారావు, జిల్లా కమిటీ సభ్యుడు జర్పుల బాలునాయక్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, కమ్మగాని నాగన్న, మూల వెంకటేశ్వర్లు, మారం శ్రీనివాస్, మేడారపు సుధాకర్, గజ్జి సంతోష్, గుగ్గిళ్ల యాకయ్య, కడుదుల కర్ణాకర్రెడ్డి పాల్గొన్నారు.