పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి
పూర్తి కావొచ్చిన పార్కుల పనులు
డీఆర్డీవో సంపత్రావు
ఖానాపురం, ఆగస్టు 19: పల్లెప్రగతి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించొద్దని డీఆర్డీవో సంపత్రావు సూచించారు. బుధరావుపేటలో గురువారం ఆయన ఎంపీడీవో సుమనావాణితో కలిసి పల్లెప్రగతి పనుల ప్రగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేజ్పార్కు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. డంపింగ్యార్డు వినియోగంలోకి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలన్నారు. పల్లెప్రకృతి వనం, శ్మశాన వాటికలో గడ్డిని తొలిగించాలన్నారు. గ్రామ పంచాయతీకి నిధుల కొరత లేనందున అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. కాగా, ఉత్తమ జీపీగా ఎంపికయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నా అధికారులు గుర్తించకపోవడం బాధాకరమని సర్పంచ్ ప్రవీణ్కుమార్ వాపోయారు. అవార్డులు రాలేదని బాధపడొద్దని, భవిష్యత్లో తప్పక గుర్తింపు లభిస్తుందని డీఆర్డీవో అన్నారు. జిల్లాలో చెన్నారావుపేట, దుగ్గొండి మండలాలు మినహా అన్నిచోట్ల పల్లె ప్రకృతి వనాలు పూర్తికావొచ్చాన్నారు. జిల్లాలో తొమ్మిది చోట్ల డంపింగ్యార్డులు, శ్మశానవాటికల పనులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. త్వరలోనే జిల్లాకు కేంద్ర ప్రభుత్వ పరిశీలనా బృందాలు రానున్నాయని, ఉపాధిహామీ పనులను పరిశీలించనున్నారని తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బందితో సమీక్షించారు. కార్యక్రమంలో ఏపీవో కీర్తి సునీత, సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్, కార్యదర్శి రజిత, ఈజీఎస్ సిబ్బంది అరుణ్కుమార్ పాల్గొన్నారు.