తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
ములుగు జడ్పీవైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి
గత ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని మరిచాయి : ఎంపీపీ
లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
ములుగురూరల్, అక్టోబర్ 18 : రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ పెండ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద దిక్కుగా మారారని ములుగు జడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీ సుధీర్యాదవ్ అధ్యక్షతన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ చేపట్టారు. ముఖ్య అతిథిగా నాగజ్యోతి హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ములుగు మండలం భాగ్యతండాలో కీమానాయక్ బిడ్డ పెండ్లికి దాచుకున్న డబ్బులు కాలిపోవగా ఉద్యమ సమయంలో ఆ గ్రామానికి వచ్చిన కేసీఆర్ అతడికి అండగా నిలిచారన్నారు. ఆయన కష్టం ఏ తండ్రికీ రావొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ సీఎం అయిన తర్వాత కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. దీంతో ఆడబిడ్డ ఉన్న ప్రతి తల్లిదండ్రులు నేడు ఎంతో ఆనందంతో కూతుళ్ల వివాహాలు చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఎంపీపీ శ్రీదేవి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని మరిచాయన్నారు. సీఎం కేసీఆర్ అనునిత్యం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ములుగు మండలంలో ఇప్పటి వరకు 70 చెక్కులు అందించగా రూ.10 లక్షల వరకు లబ్ధిదా రులకు అందాయని వివరించారు. సీఎం కేసీఆర్ మేనమామ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యు డు రియాజ్మిర్జా, టీఆర్ఎస్ ములుగు పట్టణ అధ్యక్షుడు ఎన్న విజయ్కుమార్, అడిదల అరుణ్రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.