పోషణ్ ట్రాకర్ యాప్తో పారదర్శకంగా అందనున్న సేవలు
హాజరుసహా అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదు
జిల్లాలో 695 అంగన్వాడీ కేంద్రాలు
త్వరలో స్మార్ట్ఫోన్ల పంపిణీకీ ఏర్పాట్లు
బచ్చన్నపేట, నవంబర్ 8 :అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు ఆన్లైన్లో సేవలు అందించేందుకు సర్కారు కార్యాచరణ రూపొందించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంలో అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకుంది. ఇందుకోసం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లు అందించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఐసీడీఎస్ పరిధిలో జిల్లాలో జనగామ, స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల ప్రాజెక్టులుండగా 695 అంగన్వాడీ సెంటర్లున్నాయి. ప్రస్తుతం వీటిలో 4,241 మంది గర్భిణులు, 3,199 మంది బాలింతలు, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు15,108 మంది, మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు11,595 మంది ఉన్నారు. వీరికి పౌష్టికాహారం, కోడిగుడ్ల పంపిణీ ఇతర సేవలతోపాటు వీరి రోజువారీ హాజరును ఎప్పటికప్పుడు స్మార్ట్ఫోన్లోని పోషణ్ ట్రాకర్ యాప్లో నమోదు చేస్తారు. దీంతో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకు నిరంతరం పర్యవేక్షణ చేయడం ద్వారా మెరుగైన సేవలు అందనున్నాయి.
గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లకు త్వరలో స్మార్ట్ఫోన్లు అందిచేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. పారదర్శకంగా సేవలు అందించేందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచింది. చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంలో అక్రమాలకు తావులేకుండా ‘పోషణ్ ట్రాకర్’ యాప్ను రూపొందించింది. ఇందులో భాగంగానే ప్రతి అంగన్వాడీ కేంద్రానికి స్మార్ట్ఫోన్ అందించనుంది. ఐసీడీఎస్కు చెందిన జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, కొడకండ్ల ప్రాజెక్టుల పరిధిలోని 695 అంగన్వాడీ కేంద్రాలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే స్మార్ట్ఫోన్లు జిల్లా కేంద్రానికి చేరాయి. అంగన్వాడీ టీచర్, సిబ్బంది కేంద్రానికి వచ్చిన వెంటనే పోషణ్ ట్రాకర్ యాప్కు లాగిన్ అయి ముందు గా హాజరైన చిన్నారుల సంఖ్యను ఫొటో తీయా లి. బాలింతలు, గర్భిణులకు అందుతున్న పౌష్టికాహారం, సేవలను పకడ్భందీగా యాప్లో నమో దు చేయాల్సి ఉంటుంది. అంగన్వాడీ సెంటర్కు ఎంతమంది ఎప్పుడు వచ్చారు, ఏఏ పౌష్టికాహారం అందుతుందో సూపర్వైజర్ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు స్మార్ట్ఫోన్ ద్వారా తెలుసుకోనున్నారు. దీంతో అవకతవలకు చోటులేకుండా చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుంది.
నిరంతరం పర్యవేక్షణ
అంగన్వాడీ కేంద్రాల్లో ఆధునిక సాంకేతిక సేవలు అందనున్నాయి. జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి మారుమూల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ వరకు ఆన్లైన్లో నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో 4,241 మంది గర్భిణులు, 3,199 మంది బాలింతలు, ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు15,108 మంది, మూడు నుంచి ఆరేళ్ల లోపు పిల్లలు11,595 మంది ఉన్నారు. వీరికి రోజు వారీగా అందుతున్న సేవల వివరాలను ఎప్పటికప్పుడు ఈ యాప్లో నమోదు చేస్తారు. ప్రతి రోజూ చిన్నారుల హాజరు శాతం అందులో పొందుపరుస్తారు. దీంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారం సంబంధిత అధికారులకు చేరుతుంది.
సేవలన్నీ ఆన్లైన్లోనే…
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ఇకపై ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. ప్రభుత్వం అందించే ఈ స్మార్ట్ ఫోన్లలో ప్రతి రోజూ ఉదయం కేంద్రానికి రాగానే పోషణ్ ట్రాకర్ యాప్లో లాగిన్ కావాలి. తర్వాత కేంద్రానికి ఎంత మంది చిన్నారులు వచ్చారనే విషయమై ఫొటో తీసి పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్న భోజన సమయంలో ఎంతమంది గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించామన్నది సైతం ఫొటో తీయాల్సి ఉంటుంది. కేంద్రంలో ఎంత మంది చిన్నారులున్నారు, వీరిలో ఎంత మందికి టీకాలు వేశారు, నవజాత శిశువులు, పిల్లల ఎదుగుదల ఎలా ఉందనే వివరాలతోపాటు వారి ఎత్తు, బరువును యాప్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు.
గ్రామం నుంచి రాష్ట్ర అధికారి వరకు సమాచారం
స్మార్ట్ఫోన్ల వినియోగంతో అంగన్వాడీ కేంద్రం సమాచారం జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల వరకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారం వివరాలు, వారికి అందే సేవలను ఇక ఆన్లైన్లో నమోదు అవుతాయి. సేవల అమలు విషయాలు తెలుసుకోవాలంటే ఒక్క క్లిక్ చేస్తే చాలు సూపర్వైజర్ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారి వరకు తెలుసుకునే వీలుంటుంది. కేంద్రాల సేవలు, రిపోర్టులు, నివేదికలు సైతం స్మార్ట్ఫోన్లోనే తయారు చేసి అప్లోడ్ చేసే అవకాశముంది.
త్వరలో స్మార్ట్ఫోన్ల పంపిణీ..
ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అందించిన స్మార్ట్ ఫోన్ల పంపిణీని త్వరలో చేపడుతాం. జిల్లాలోని 695 అంగన్వాడీ కేంద్రాలకు సరిపడా స్మార్ట్ఫోన్లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఒక్కో కేంద్రానికి ఒకటి అందిస్తాం. కేంద్రాల ద్వారా చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు స్మార్ట్ఫోన్ ద్వారా సమాచారాన్ని యాప్లో నమోదు చేస్తారు. ఏ కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఎంత మంది ఉన్నారు అనే విషయం ఏరోజుకారోజు తెలుస్తుంది. పౌష్టికాహారంతోపాటు కోడిగుడ్ల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. ఎలాంటి అవకతవకలకు అవకాశం ఉండదు.
-జయంతి. డీడబ్ల్యూవో, జనగామ