వచ్చే పురపాలక సంఘం ఎన్నికల్లోపు సర్కారు ఉత్తర్వులు
ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వెల్లడి
రూ.50 లక్షలతో గ్రామపంచాయతీ ఆవరణలో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ
స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 7 : అభివృద్ధిలో వేగంగా విస్తరిస్తున్న స్టేషన్ఘన్పూర్ను త్వరలోనే మున్సిపాలిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే పురపాలక సంఘం ఎన్నికలలోపు ఉత్తర్వులు వెలువడుతాయని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వెల్లడించారు. ఆదివారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రూ.50 లక్షలతో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తాటికొండ సురేశ్కుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాజయ్య మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రంలో సుమారు 13 వేల జనాభా ఉందని, రానున్న రోజుల్లో మున్సిపాలిటీగా మారుతుందన్నారు. ఇప్పటికే రూ.2 కోట్లకుపైగా నిధులతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేశామన్నారు. ‘కుడా’ నిధులతో బీటీ రోడ్లు వేశామని, త్వరలో ఆర్సీఎం చర్చి నుంచి జాతీయ రహదారి వరకు రూ. 15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. ైప్లె ఓవర్ బ్రిడ్జి వద్ద మార్కెట్ సముదాయానికి అనుమతులు వచ్చాయని, త్వరలోనే శంకుస్థాపన చేస్తామని రాజయ్య వివరించారు. గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేటు వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు. రిజర్వాయర్కట్ట వద్ద పది ఎకరాల స్థలంలో బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. టీఆర్ఎస్ పాలనలోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపీపీ కందుల రేఖా గట్టయ్య, ఉప సర్పంచ్ నీల ఐలయ్య, ఎంపీటీసీలు సింగపురం దయాకర్, గన్ను నర్సింహులు, మునిగెల రాజు, ఎంపీడీవో కుమారస్వామి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మునిగెల రాజు, ఆర్ అండ్ బీ వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు, మాతంగి దేవయ్య, గుర్రం శంకర్ తదితరులు పాల్గొన్నారు