మహబూబాబాద్, డిసెంబర్ 4: ప్లాస్టిక్ వాడకాలను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో పూర్తిగా మానేయాలని మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ -2022 కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలోని వైఎస్సార్ విగ్రహం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ప్లాస్టిక్ వాడొద్దని ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం వద్ద చైర్మన్ రామ్మోహన్రెడ్డి, కమిషనర్ ప్రసన్నరాణి, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు తడి, పొడి చెత్త వేరు చేయడంపై, కంపోస్టు ఎరువుల తయారీ, ప్లాస్టిక్ నిషేధంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ప్రతి విద్యార్థి బాధ్యతగా ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. ఇంట్లోని చెత్త ద్వారా కంపోస్టు ఎరువు తయారు చేసి ఇళ్లలోని మొక్కలకు వాడాలన్నారు. సాయంత్రం రైల్వే అండర్బ్రిడ్జి పనులను పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా, నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఫ్లోర్లీడర్ చిట్యాల జనార్దన్, 18, 8, 9వ వార్డు కౌన్సిలర్లు వేణుమాధవ్, బానోత్ రవికుమార్, హరిసింగ్, శివ, కోఆప్షన్ సభ్యులు నిమ్మల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీహరి, గురులింగం, ఈఈ క్రాంతి, ట్రైబల్ వెల్ఫేర్, మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.