భూపాలపల్లి రూరల్/భూపాలపల్లి టౌన్/కృష్ణకాలనీ/ ములుగుటౌన్/ములుగురూరల్/కాటారం/మహదేవపూర్/కాళేశ్వరం, అక్టోబర్ 31: ఉక్కు మనిషి, స్వాతంత్ర సమరయోధుడు, మెదటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాలపల్లి కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ భవేశ్ మిశ్రా జ్యోతి ప్రజ్వలన చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అధికారులు, సిబ్బందితో జాతీయ ఐక్యత పై ప్రతిజ్ఞ చేయించారు. సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, అదనపు కలెక్టర్ దివాకర, సీపీవో సామ్యూల్, కలెక్టరేట్ ఏవో మహేశ్బాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి భాస్కర్, డీపీఆర్వో రవికుమార్, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్లు గౌస్, రవికుమార్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం తన కార్యాలయంలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. వల్లభాయ్ పటేల్ జయంతిని ‘ఏక్తా దివస్-ఐక్యతా దిపోత్సవం’ గా జరుపుకోవడం గర్వకారణమని డీఎంహెచ్వో అన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ జగదీశ్, మాస్ మీడియా ఆఫీసర్ అన్వర్, సూపర్వైజర్ బృంద, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో సిబ్బంది సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. నాయబ్ తహసీల్దార్ ప్రసాద్, వీఆర్వో సూరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ములుగు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య తన కార్యాలయంలో పటేల్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్టాఫ్, నర్సులు, సిబ్బంది ఉన్నారు. కాటారం మండలంలో పటేల్ జయంతిని అన్ని వర్గాల ప్రజలు నిర్వహించారు. మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయంలో పటేల్ జయంతి నిర్వహించారు. జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు. ఎంపీపీ పంతకాని సమ్మయ్య, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీటీసీలు జాడి మహేశ్వరి, మహేశ్ రవీందర్ రావు, ఏపీవో వెంకన్న, ఆర్ఐ భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏక్తా దివస్, వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఙ చేయించారు. ఎంపీపీ బన్సోడ రాణీబాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, తహసీల్దార్ శ్రీనివాస్, పలిమెల ఎంపీపీ బుచ్చక్క, మహదేవపూర్ సర్పంచ్ శ్రీపతిబాపు, కార్యదర్శి సమ్మయ్య పాల్గొన్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఉన్న హారిత హోటల్లో మేనేజర్ సురేశ్ ఆధ్వర్యంలో వల్లాభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు.