ఓరుగల్లులో జననం..భాగ్యనగరంలో మరణం
ఫొటోగ్రఫీలో తనదైన ముద్ర
పల్లె జీవనం ఉట్టిపడేలా ఫొటోలు తీయడంలో దిట్ట
కవులు, కళాకారులతో ఎనలేని అనుబంధం
పోచమ్మమైదాన్, జనవరి 31 : ఓరుగల్లుకు చెందిన ఫొటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ ఇక లేరు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఫొటోలు తీసి అందరి మన్ననలు పొందిన ఆయన అనారోగ్యంతో హైదరాబాద్లో ఆదివారం రాత్రి మృతి చెందారు. దీంతో పుట్టిన గడ్డ వరంగల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వరంగల్ బీట్బజార్కు చెందిన గుడిమల్ల లక్ష్మీనారాయణ-అనసూయ దంపతుల కొడుకు భరత్ భూషణ్ 40 ఏళ్ల క్రితం హైదరాబాద్కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గ్రామీణ జీవనం, తెలంగాణ పల్లె దర్వాజలు, బతుకమ్మ ఫొటోలు, కరువు కాటకాలు, వలసలు, జీవన విధ్వంసానికి సంబంధించి ఆయన తీసిన చిత్రాలు ఆలోచింపజేస్తాయి. భరత్ భూషణ్ సొంత ఇల్లు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ ఇల్లు పక్క పక్కనే ఉండడంతో వారింట్లో ఓ సభ్యుడుగా మెలిగారు. ఈ క్రమంలో కళాకారుల జీవన చిత్రాలను కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. భరత్ భూషణ్ ప్రతిభను గుర్తించిన నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ నిర్వాహకులు 2019 సంవత్సరంలో జీవన సాఫల్య పురస్కారం అందజేశారు.
జీవిత చరిత్ర రాయకుండానే కన్నుమూశాడు ప్రముఖ కవి, డాక్టర్ ఉమామహేశ్వర్రావు భరత్ భూషణ్ మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నా. 50 సంవత్సరాల స్నేహం మాది. నన్ను సోదరుడిగా గౌరవించేవారు. చిన్ననాటి నుంచే చిత్రకళ అంటే వల్లమాలిన అభిమానం. కాలేజీ రోజుల్లో రకరకాల బొమ్మలు వేసి మై మరిపించేవారు. ఆనాడు చాంబర్ ఆఫ్ కామర్స్లో తొలి చిత్ర ప్రదర్శన చేయించాము. తర్వాత మంచి ఫొటోగ్రాఫర్గా, వీడియోగ్రాఫర్గా ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టారు. అనారోగ్యంతో ఉన్న సమయంలో ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరత్ భూషణ్ ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందించారు. ఆయన జీవన విధానంపై చరిత్ర రాద్దామనుకున్న లోపే చనిపోవడం బాధాకరం. వారం రోజుల క్రితం కూడా అతడితో మాట్లాడాను. చివరకు అనంతలోకాలకు వెళ్లిపోయి తాను ఓ ఫొటోగా మారిపోయాడు.