గుడికి 20 మీటర్ల దూరంలో తాత్కాలిక దుకాణాలు
కలెక్టర్ కృష్ణ ఆదిత్య ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు
ఎస్పీ సంగ్రామ్సింగ్ జి.పాటిల్
గట్టమ్మ పరిసర ప్రాంతాల పరిశీలన
ములుగురూరల్, జనవరి 31 : మండల పరిధిలోని మొదటి మొక్కుల తల్లి అయిన గట్టమ్మ వద్ద మేడారం భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గట్టమ్మ దేవాలయం అంటే ఆదివాసీ నాయకపోడ్ల ఇలవేల్పు అమ్మవారు అన్నారు. తల్లి ఆశీస్సులు తీసుకొని భక్తులు మేడారం వనదేవతల దర్శనానికి వెళ్తారని తెలిపారు. గట్టమ్మ సందర్శనకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయానికి 20 మీటర్ల దూరంలో తాత్కాళిక దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తాత్కాళిక పద్ధతిలో పార్కింగ్ స్థలం, 250 మీటర్ల వెడల్పు సీసీ రోడ్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లైటింగ్, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఆలయం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామని ఆదివాసీ నాయకపోడ్ పెద్దలకు కలెక్టర్ సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ జాతరకు సమయం ఉన్నా సుదూర ప్రాంతాల నుంచి ముంద స్తు మొక్కు లు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో మేడారం వస్తున్నారని, ఈ క్రమంలో గట్టమ్మ వద్ద ఆగే ఆనవాయితీ ఉన్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పా ర్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వారి వెంట డీఆర్వో రమాదేవి, ఏఎస్పీ , మేడారం ఇన్చార్జి డీసీపీ ఉన్నారు.
పార్కింగ్ స్థలాలపై దృష్టి పెట్టాలి
ములుగుటౌన్: భక్తుల రద్దీ దృష్ట్యా మేడారం జాతరలో పక్కా ప్రణాళికతో పార్కింగ్పై దృష్టి సారించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్ చాంబర్లో పార్కింగ్ ప్రదేశాలు, పోలీస్ కమాండ్ కంట్రోల్రూం, పబ్లిక్ అడ్వైజరీ సిస్టం ఏర్పాటుపై జిల్లా పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం 34 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. భూములు చదును చేయించి గ్రావెల్, స్టోన్ డస్ట్ పోయించాలన్నారు. సమావేశంలో ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, ఏఎస్పీ సుధీర్ ఆర్ కేకాన్, డీసీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు.