బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం జనగామ ముస్తాబవుతున్నది. ఒకేసారి 115 మంది అభ్యర్థులను ప్రకటించి దమ్మున్న పార్టీ నేతగా మరోసారి నిరూపించుకున్న ఆయన.. ఉరిమే ఉత్సాహంతో ఎన్నికల సమరాంగణంలో అడుగుపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో జనగామలో ఈ నెల 16న నిర్వహించబోతున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే తొలి ప్రచార సభ కానున్నది. ఇక్కడి నుంచి ఎన్నికల క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టనున్న క్రమంలో ముఖ్యమంత్రి సభా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుండగా, శుక్రవారం ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు.
– జనగామ, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ)
జనగామ వేదికగా గులాబీబాస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. ఈ నెల 16న జనగామలో నిర్వహించే సభ ద్వారా ఉమ్మడి జిల్లా ఎన్నికల ప్రజా ఆశీర్వాద సభలకు శ్రీకారం చుట్టబోతున్నారు. 27న స్టేషన్ఘన్పూర్, నామినేషన్ల తర్వాత పాలకుర్తిలో అధినేత బహిరంగ సభలు జరుగుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 16న జనగామలో సీఎం కేసీఆర్ పాల్గొననున్న ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభావేదిక, హెలీప్యాడ్ పనులు చకచకా జరుగుతున్నాయి. సిద్దిపేట రోడ్డులోని వికాస్నగర్ వద్ద మెడికల్ కాలేజీ కోసం కేటాయించిన స్థలంలో మైదానాన్ని చదును చేసి ప్రధాన వేదిక సహా ప్రజలు కూర్చునేందుకు షామియానాలు, కుర్చీలు, సౌండ్ సిస్టమ్, లైటింగ్ పనులు చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం సభా వేదిక మైదానం సహా హెలిప్యాడ్ పనులు, వివిధ ప్రాంతాల నుంచి సభకు వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాలను జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. చేర్యాల, కొమురవెల్లి, దూల్మిట్ట, మద్దూరు, బచ్చన్నపేట మండలాల నుంచి వచ్చే వాహనాలకు సిద్దిపేట రోడ్డులో బాలాజీ ఫంక్షన్హాల్, శామీర్పేట-పసరుమడ్ల మార్గంలో పార్కింగ్కు స్థలాన్ని ఖరారు చేశారు. అలాగే నర్మెట, తరిగొప్పుల, జనగామ రూరల్ మండలాల నుంచి వచ్చే వాహనాలకు వడ్లకొండ బైపాస్ రోడ్డులో, రఘునాథపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలకు ప్రెస్టన్ మైదానం, సూర్యాపేట వైపు నుంచి వచ్చే వాహనాలకు బతుకమ్మకుంట, ఎన్ఎంఆర్ గార్డెన్ ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించాలని బీఆర్ఎస్ నాయకులు పోలీసులను కోరారు.
హెలిప్యాడ్ కోసం వికాస్నగర్లో బీఆర్ఎస్ సన్నాహక సభ జరిగిన స్థలాన్ని ఖరారు చేసి ఇప్పటికే నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎండవేడిమి ఎక్కువగా ఉంటున్న దృష్ట్యా ప్రత్యేకం బారికేడ్లు, షామియానాలు, పెద్ద ఎత్తున ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బహిరంగ సభ, సీఎం సభాస్థలి, హెలీప్యాడ్ వద్ద బందోబస్తు వంటి ఏర్పాట్లపై పోలీసుశాఖ కసరత్తు చేస్తున్నది. అధినేత సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ జిల్లా శ్రేణులు ఇప్పటికే రంగంలోకి దిగాయి. సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ, భారీగా జన సమీకరణ చేసేందుకు దిశానిర్దేశం చేస్తున్నాయి.