ఏటూరునాగారం, ఫిబ్రవరి 6 : పోలీస్ ఉద్యోగార్థులకు మెయిన్స్లో అర్హత సాధించేందుకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో అంకిత్ తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 282 మంది గిరిజన యువతకు ప్రిలిమ్స్ కోసం ఇచ్చిన శిక్షణలో 180 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. కాగా, 174 మంది ఫిజికిల్ ఈవెంట్స్లో పాల్గొనేందుకు శిక్షణ ఇవ్వగా 159 మంది అర్హత సాధించారన్నారు. వీరితో పాటు మరి కొంత మంది ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించే మెయిన్స్ కోసం ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ను ఆరెపల్లిలోని పీఎంహెచ్ భవనంలో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 8 నుంచి 200 మంది అభ్యర్థులకు నిపుణులతో కోచింగ్ ఇస్తామని, ఇందులో 50 మంది ఎస్సై, 150 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నట్లు చెప్పారు.
అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రూప్-4కు సిద్ధమయ్యే అభ్యర్థులకు మే నుంచి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పీఎంఈజీపీ కింద పది పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నామన్నారు. ఇందులో గోవిందరావుపేట మండలంలో ఒక రైస్ మిల్లును రూ. 75 లక్షలు ఒక లబ్ధిదారుడికి మంజూ రు చేసినట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ కింద కొత్తగా 16 యూనిట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో మహబూబాబాద్, ములుగుకు చెందిన నలుగురికి చేపలు, రొయ్యలు మార్కెట్ చేసుకునేందుకు కోల్డ్స్టోరేజ్తో కూడిన వాహనాలు ఇస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలోని హెచ్ఎన్టీసీల్లో డిమానిస్ట్రేషన్ కోసం ఆయిల్పామ్ తోటల పెంపకానికి వాటిని సిద్ధం చేస్తున్నామని వివరించారు.
వెంకటాపురం, పలిమెల మండల కేంద్రాల్లో జాబ్మేళాలు నిర్వహించి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఇటీవల జాకారంలో నిర్వహించిన జాబ్మేళాలో సుమారు 388 మంది 22 కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎంపికైనట్లు పీవో తెలిపారు. రూ. 7.16 కోట్లతో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ఉచితంగా వాచ్, కాలిక్యులెటర్ అందిస్తున్నామని చెప్పారు. సాయం త్రం స్నాక్స్ను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 4వేల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నట్లు వివరించారు. ఎకనామికల్ సపోర్టు స్కీం కింద 200 యూనిట్లు మొదటి విడుత మంజూరు చేశామని, పెండింగ్లో ఉన్న యూనిట్లను గ్రౌండింగ్ చేసేందుకు బ్యాంకు మేనేజర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పీవో వెల్లడించారు.