ఏటూరునాగారం, డిసెంబర్ 20 : రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటాలని ఐటీడీఏ పీవో అంకిత్ క్రీడాకారులను కోరారు. ఏటూరునాగారంలోని కుమ్రంభీం స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించే గిరిజన పాఠశాలల జోనల్ స్థాయి క్రీడలు బుధవారం ప్రారంభమయ్యాయి. క్రీడాజ్యోతిని వెలిగించిన అనంతరం పీవో మాట్లాడారు. గత క్రీడల్లో ఈ ప్రాంతం నుంచి అనేక మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని, గురుకులం నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవడం హర్షనీయమన్నారు. క్రీడల నిర్వహణపై స్పోర్ట్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వచ్చే నెలలో భద్రాచలంలోని కిన్నెరసానిలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికయ్యేందుకు క్రీడాకారులు తమ నైపుణ్యతను ప్రదర్శించాలన్నారు.
వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్ జిల్లాల్లోని ఆశ్రమ పాఠశాలలకు చెందిన 14,15 సంవత్సరాల బాల, బాలికలు 1,984 మంది పాల్గొంటున్నారన్నారు. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, క్యారమ్, టెన్నికాయిట్, ఆర్చరీ, అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఉంటాయని స్పోర్ట్స్ అధికారులు తెలిపారు. ప్రతి ఈవెంట్ నుంచి ఒక టీంను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ పోచం, మహబూబాబాద్ డీడీ మంకిడి ఎర్రయ్య, జీసీసీ డీఎం ప్రతాప్రెడ్డి, ఏటీడీవో దేశీరాం నాయక్, ఏసీఎంలో రవీందర్, శ్రీరాములు, డిప్యూటీ డీఈవో సారయ్య, స్పోర్ట్స్ ఆఫీసర్లు కిష్టు నాయక్, ఆదినారాయణ, మోహన్, శ్యామలత, స్కౌట్స్ ఆఫీసర్ గోపాల్, జీసీడీవో సుగుణ, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, పాల్గొన్నారు.