వరంగల్, జూలై 25(నమస్తేతెలంగాణ) : వర్షం ముంచెత్తింది. భారీ వానలతో రెండు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. జన జీవనం స్తంభించింది. వరంగల్ జిల్లాలో 141.0మిల్లీమీటర్లు.. హనుమకొండ జిల్లాలో 103.6మి.మీ వర్షపాతం నమోదైంది. వరద నీటితో వాగులు, ఒర్రెలు పొంగుతుండగా, చెరువులు అలుగు పోస్తున్నాయి. కాజ్వేలు, కల్వర్టుల మీదుగా నీరు ప్రవహిస్తుండడంతో పలు రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి కొన్నిచోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. ధర్మసాగర్ మండలం ధర్మాపురంలో పిడుగుపాటుతో 25గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోకి నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు అరూరి, నన్నపునేని, కలెక్లర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, సీపీ రంగనాథ్, బల్దియా కమిషనర్ రిజ్వాన్ బాషా పర్యటించారు. అధికార యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాయి. కాగా, మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వరంగల్కు రెడ్ అలర్ట్.. హనుమకొండకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
వరంగల్ జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారే వరకు వాన దంచికొట్టింది. కుండపోతతో జిల్లా తడిసిముద్దయింది. వర్షం ఏకధాటిగా కురిసింది. అనూహ్యరీతిలో మంగళవారం జిల్లావ్యాప్తంగా 1,868.2 మి.మీ వర్షం కురిసింది. పదమూడు మండలాల్లో సగటు వర్షపాతం 143.7 మి.మీ నమోదైంది. సంగెం మండలంలో 218.4 మి.మీ అత్యంత భారీ వర్షం కురిసింది. ఈ ఏడాది జిల్లాలో ఇదే అధిక వర్షపాతం కావడం గమనార్హం. మండలాల వారీగా గీసుగొండలో 180, వర్ధన్నపేటలో 177.6, నల్లబెల్లిలో 172.2, రాయపర్తిలో 160.2, ఖిలావరంగల్లో 155.6, దుగ్గొండిలో 143.2, పర్వతగిరిలో 132.2 మి.మీ అతి భారీ వర్షం పడింది. చెన్నారావుపేటలో 113.8, నెక్కొండలో 109.2, ఖానాపురంలో 105.6, వరంగల్లో 105, నర్సంపేటలో 95.2 మి.మీ భారీ వర్షం నమోదైంది. వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లోని వివిధ గ్రామాల మీదుగా ఆకేరు వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. చెరువులు మత్తడి పోస్తుండడంతో ఒర్రెలు, కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. వాటితో పాటు వాగును ఆనుకుని ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. నర్సంపేట మండలంలోని మాదన్నపేటతో పాటు మరికొన్ని చెరువులు మత్తడి దుంకుతుండడంతో ఇక్కడ కొన్ని రూట్లలో రాకపోకలు నిలిచిపోయాయి.
నర్సంపేట- నెక్కొండ ప్రధాన రహదారిలో పాత ముగ్దుంపురం గ్రామం వద్ద కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ఈ రూటులో మంగళవారం తెల్లవారుజాము నుంచి రాకపోకలు స్తంభించాయి. నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామం రూటులోనూ రాకపోకలకు బ్రేక్ పడింది. సంగెం మండలంలోని కాపులకనపర్తి- కాట్రపల్లి గ్రామాల మధ్య వరద ఉధృతికి రహదారి కోతకు గురి కావడంతో ఈ రూటులోనూ రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్- ఖమ్మం హైవేలో పంథిని గ్రామం వద్ద కల్వర్టు మీదుగా వరద నీరు ప్రవహించడం వల్ల మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు వర్ధన్నపేట రూటులో రాకపోకలు ఆగిపోయాయి. ఎడతెరిపిలేని వానతో వివిధ గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలిపోయాయి. వరద పోటెత్తడంతో పలు గ్రామాల్లో ఇండ్లలోకి నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు తమ సిబ్బందితో గ్రామాల్లో ప్రజలను అలర్ట్ చేశారు. ప్రాణ, ఆస్తి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో కొన్ని ఇండ్లలోకి నీరు రావడంతో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ ప్రావీణ్య తదితరులు ఇల్లంద గ్రామాన్ని సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. అంతకుముందు కలెక్టర్ ప్రావీణ్య సంగెం మండలంలోని కాపులకనపర్తి వద్ద కోతకు గురైన రోడ్డును పరిశీలించారు.
వరంగల్లో సహాయక చర్యలు
వరంగల్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఇండ్లలోకి ప్రవేశించడంతో అధికార యం త్రాంగం రంగంలోకి దిగి అక్కడి ప్రజలను అప్రమత్తం చేసింది. వరదలు, పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను అలెర్ట్ చేస్తున్నారు. కలెక్టర్ సహాయక చర్యలకు ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆమె లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనరు షేక్ రిజ్వాన్ బాషా తదితరులు మొదట 14 డివిజన్లోని ఎస్సార్నగర్ను సందర్శించారు. పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి వరద నీరు చేరిన ఇండ్ల ప్రజలతో మాట్లాడారు. సహాయక చర్యలపై మున్సిపల్, ఇతర శాఖల అధికారులకు సూచనలు చేశారు. దీంతో ఎస్సార్నగర్లోని బాధితుల కోసం అధికారులు సమీపంలో ఉన్న వంద ఫీట్ల రోడ్డులోని ఒక గార్డెన్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి భోజన వసతి కల్పించారు.
వరంగల్లోని అండర్బ్రిడ్జి ప్రాంతంలో వరద నీరు చేరిన కాశీకుంట, ఎస్ఆర్ఆర్ తోట, సాకరాశికుంట, డీకేనగర్, సాయినగర్, ఎన్టీయార్నగర్ తదితర కాలనీల్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి, సీపీ రంగనాథ్, కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనరు షేక్ రిజ్వాన్ బాషా, ఏసీపీ బోనాల కిషన్తో పాటు కార్పొరేటర్లు, ఇన్స్పెక్టర్లు, జీడబ్ల్యూఎంసీ అధికారులు పర్యటించారు. ట్రాక్టర్లు, బోట్లలో ప్రయాణించి పరిస్థితిని పరిశీలించారు. వరద నీరు నిలిచిన చోట పరిస్థితిపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఇక్కడి మైసయ్యనగర్తో పాటు ముంపు ప్రాంతాల్లోని గాంధీనగర్, తదితర కాలనీల్లోనూ అధికారులతో కలిసి పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నన్నపునేని చెప్పారు. ఎన్టీయార్నగర్, సంతోషిమాతకాలనీ, బృందావన్కాలనీల్లోనూ సీపీ రంగనాథ్, ఏసీపీ కిషన్, మట్టెవాడ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తదితర పోలీసు అధికారులతో పర్యటించి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపును పరిశీలించారు. ఇక్కడ పోలీసులు, జీడబ్ల్యూఎంసీ అధికారులతో కలిసి బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. సంతోషిమాతకాలనీలోని ఓ గార్డెన్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రావీణ్య, మేయర్ గుండు సుధారాణితో కలిసి శివనగర్, మైసయ్యనగర్లోనూ పర్యటించారు. 16వ డివిజన్ పరిధిలోని గరీబ్నగర్, కీర్తినగర్, ధర్మారం తదితర ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.
అలుగు పోస్తున్న చెరువులు
భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు నీటితో నిండుతున్నాయి. ఇప్పటికే ఎక్కువ శాతం చెరువులు నీటితో నిండి అలుగు పోస్తున్నాయి. జిల్లాలో 815 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటిలో 552 చెరువులు మత్తడి దుంకుతున్నాయి. మరో 222 చెరువుల్లోకి 75 నుంచి 100 శాతం నీరు చేరింది. ఇంకో 34 చెరువుల్లోకి 50 నుంచి 75 శాతం, 7 చెరువుల్లోకి 25 నుంచి 50 శాతం నీరు చేరినట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. సంగెం మండలంలో 70 చెరువులు ఉంటే వాటిలో అన్ని చెరువులు మత్తడి పోస్తున్నాయి. వర్ధన్నపేట మండలంలో 68 చెరువులు ఉన్నాయి. వాటిలో 67 అలుగు పోస్తుండగా మిగిలిన ఒక చెరువులోకి నీరు 75 నుంచి 100 శాతం చేరింది. ఖానాపురం మండలంలో 23 చెరువులు ఉండగా 22 చెరువులు నీటితో నిండి మత్తడి దుంకుతున్నాయి. మిగ తా ఒక చెరువులోకి నీరు 50 నుంచి 75 శాతం చేరినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో పెద్దవైన మాదన్నపేట, రంగాయచెరువు, ఎల్గూరురంగంపేట వంటి చెరువులు సైతం మత్తడి పోస్తున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా ప్రభుత్వం పునరుద్దరించడం వల్ల వాన దంచికొట్టినా చెరువులు, కుంటలు గండ్లు పడకుండా భద్రంగా ఉన్నాయి. కొన్ని చెరువుల పరిధిలోని కాల్వలకు గండ్లు పడగా జలవనరులశాఖ ఇంజినీర్లు తాత్కాలికంగా ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు.