ఎప్పటిలాగే ఉమ్మడి జిల్లావాసులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఓరుగల్లుకు భంగపాటే ఎదురైంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను ఒక్కటీ నెరవేర్చకపోగా, కనీసం వాటి ఊసు కూడా ఎత్తలేదు. ఇక్కడి ప్రజల చిరకాల కోరికలైన విమానాశ్రయ పునరుద్ధరణ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, మేడారం జాతీయ హోదా ఆశలు అడియాసలే అయ్యాయి. రూ.520 కోట్ల అవసరం ఉన్న కాజీపేట పీవోహెచ్కు కేవలం రూ.150 కోట్లు కేటాయించి, కమలం సర్కారు చేతులు దులుపుకొన్నది.
– వరంగల్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బీజేపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వరంగల్ ఉమ్మడి జిల్లా అంశాలను పట్టించుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల విషయంలో ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కొత్త పథకాల విషయంలోనూ మొండిచెయ్యే చూపింది. పునర్విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయాన్ని ప్రస్తుత బడ్జెట్లోనూ ప్రస్తావించలేదు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో దాటవేత ధోరణి ప్రదర్శించింది. సమృద్ధిగా వనరులున్నా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఎటూ తేల్చకపోవడంతో ఉపాధి కోసం ఎదురు చూసే యువత మరోసారి నిరాశకు లోనైంది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఎన్నిసార్లు కోరినా కేంద్రం పట్టించుకోలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతేడాది వరంగల్ నగరానికి స్వయంగా వచ్చి కాజీపేటలో రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.520 కోట్లు అవసరమవుతాయని కేంద్ర రైల్వే శాఖ అంచనా వేసింది.
ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.150 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. డీజిల్ లోకోషెడ్ అభివృద్ధి పనులకు కేవలం రూ. 13 కోట్లు కేటా యించింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు జాతీయ హోదాపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ప్రతి జాతరకు కోటి మందికిపైగా ఈ జాతరకు వస్తారు. మేడారం జాతరకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోలేదు. ప్రస్తుత బడ్జెట్లోనూ ఇదే తీరుగా వ్యవహరించింది. ఇక స్మార్ట్ సిటీగా ఎంపికైన వరంగల్ నగరానికి బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయించారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. రెండో శ్రేణి నగరాలకు విమానరంగం సేవలను విస్తరిస్తామని కేంద్ర బడ్జెట్లో పేర్కొన్నా, ఈ ప్రాధాన్యంలో మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ ఉంటుందా? లేదా అని ఉమ్మడి జిల్లా ప్రజల్లో అనుమానం నెలకొంది.