ములుగు, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేసి పైసా ఇవ్వకుండా ఓ వ్యాపారి రైతులను ఇబ్బంది పెడుతున్న ఘటన ములుగు మండలం శ్రీనగర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం బాధిత రైతులు ‘నమస్తే తెలంగాణ’ను సంప్రదించి తమ గోడు వెల్లబోసుకున్నారు. రైతులు అజ్మీరా హర్సింగ్, బిలావత్ భిక్షపతి, లాగు సాంబయ్య, అజ్మీరా వాక్య, గుగులోత్ రాజు, గుగులోత్ బీమా, భూక్యా భిక్షపతి, నక్క రవి, బిలావత్ మమత, తోట రాజేందర్, నల్లెల్ల రాజయ్య, రవి, కొత్తూరు మహేందర్, గుగులోత్ బీకు, కీయా, మున్నా, బిలావత్ అచ్చి, మాలోత్ మంజీలాల్, గుగులోత్ కొమ్మాలు, హతిరామ్ మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల అంజనాపురం గ్రామానికి చెందిన వ్యాపారి నెమలపూరి శ్రీనివాస్ తమ గ్రామంలో ఉంటున్నాడని తెలిపారు. 2013లో వరి, మక్కజొన్న ఉత్పత్తులను సుమారు 56 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. వాటిని అమ్మిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పి తమకు రావాల్సిన రూ.30లక్షలు ఇవ్వకుండా కుటుంబంతో సహా ఉడాయించాడని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత అతడి భార్య మమత గ్రామానికి రాగా, డబ్బులు విషయమై నిలదీయంతో రెండున్నర ఎకరాల భూమిని ఇచ్చిందని తెలిపారు. తమ గ్రామంలో 40 ఎకరాల భూమి ఉన్న రిటైర్డ్ ఆర్టీవో రాజేశ్వర్రావు ఆ భూమిని కొనుగోలు చేసి, తమ డబ్బులు తమకు ఇచ్చి, మిగితా డబ్బులను శ్రీనివాస్ భార్య మమతకు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.
ఆ సమయంలో రాజేశ్వర్రావు తమకు తలా రూ.2వేలు నుంచి రూ.3వేలు అప్పటి అవసరాల నిమిత్తం ఇచ్చినట్లు తెలిపారు. శ్రీనివాస్ కొన్ని నెలల క్రితం గ్రామానికి వచ్చినా, అతడి మోసాన్ని దిగమింగుకొని అతడి భార్య ఇచ్చిన భూమినిలో పని చేసుకుంటూ వస్తున్నామన్నారు. గతేడాది రాజేశ్వర్రావు అనారోగ్యంతో మృతిచెందాడని అన్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ తాము అతడి భార్యను బెదిరించి భూమిని రాయించుకున్నామని గొడవ చేసి 2016లో తమలోని నలుగురిపై కేసులు పెట్టించాడని వాపోయారు. ప్రస్తుతం రాజేశ్వర్రావు మృతిచెందగా, అతడి కొడుకు వినయ్కుమార్తో శ్రీనివాస్ ఒప్పందం కుదుర్చొని గ్రామానికి చెందిన బిలావత్ దేశ్య, గుగులోత్ భిక్షపతి, తోట కుమారస్వామి, గుగులోత్ కిషన్తో కలిసి తమకు రాసి ఇచ్చిన భూమిని వాటాలుగా చేసుకుని పంచుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మంత్రి సీతక్క పేరు చెబుతూ దేశ్య బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై ఈ నెల 8న కలెక్టర్ను కలిసి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందించినట్లు రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.