కరీమాబాద్, జనవరి 10: క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్టు సహకారంతో క్లాసిక్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో కరీమాబాద్ రామస్వామి గుడి మైదానంలో చేపట్టిన కేపీఎల్-13 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నన్నపునేని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇప్పిస్తానన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకిస్తూ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. క్రీడల నిర్వాహణకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉందన్నారు. క్లాసిక్ క్రికెట్ క్లబ్ చైర్మన్ అక్తర్ మాట్లాడుతూ అందరి సహకారంతో 12 ఏళ్లుగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎన్ఎన్ చారిటబుల్ ట్రస్టు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సహకారంతో కేపీఎల్-13 నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, పోశాల పద్మ, సిద్దం రాజు, నాయకులు ఎంఏ జబ్బార్, మండ వెంకన్న, పల్లం రవి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే నరేందర్ బ్యాటింగ్తో అలరించారు. బాల్ను నలు వైపులా తరలిస్తూ ప్రేక్షకులు, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో ఫొటోలు దిగారు. అనంతరం క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
వరంగల్చౌరస్తా: అనంతలక్ష్మి ఆయుర్వేద దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకుడు జారతి రమేశ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జారతి రమేశ్తో కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 27వ డివిజన్ నాయకులు అనంతలక్ష్మి ఆయుర్వేద దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.