వాజేడు, డిసెంబర్ 25 : ములుగు జిల్లా వాజేడు ఏజెన్సీలో కొన్నిరోజులుగా మంచు విపరీతంగా కురుస్తున్నది. సోమవారం ప్రగళ్లపల్లి, జగన్నాథపురం తదితర మన్యం గ్రామాలను మంచు దుప్పటి కప్పేసింది. వాజేడు నుంచి వెంకటాపురం మండలానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారితో పాటు 163 జాతీయ రహదారిపై పొగమంచు పరుచుకోవడంతో వాహనదారులు ఉదయం 9 గంటలకు సైతం లైట్లు వేసుకొని ప్రయాణించారు. పొగమంచుకు తోడు తీవ్రమైన చలి కారణంగా ముఖ్యమైన పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. కాగా, ఉదయం చలిమంటలు వేసుకొని స్థానికులు ఉపశమనం పొందుతున్నారు.