తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించడంతో పాటు బీఆర్ఎస్కు ఆవిర్భావం నుంచి అండగా నిలుస్తున్న చారిత్రక ఓరుగల్లు మరో బృహత్తర కార్యక్రమానికి వేదిక కాబోతున్నది. బాగా కలిసి వచ్చిన వరంగల్ నుంచే గులాబీ పార్టీ మరోసారి ఎన్నికల శంఖారావం పూరించబోతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే మొదలుపెట్టనుంది. అక్టోబరు 16న ఇక్కడ 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది. ఔటర్ రింగురోడ్డు దగ్గరలో ఉనికిచర్ల, దేవన్నపేట ప్రాంతాల్లో 150 ఎకరాల్లో చరిత్రలో నిలిచిపోయేలా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
– వరంగల్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వరంగల్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదినుంచీ గులాబీ పార్టీకి అండగా నిలిచిన ఓరుగల్లు నుంచే మళ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని వరంగల్ సభ నుంచే ప్రారంభించాలని సంకల్పిచింది. 150 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. 200 ఎకరాల్లో పార్కింగ్ ఉండనున్నది. బీఆర్ఎస్ గత బహిరంగ సభలకు దీటుగా ఈ బహిరంగ సభ ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. 2017లో వరంగల్ నగరంలోని ప్రకాశ్రెడ్డిపేటలో నిర్వహించిన సభకు దీటుగా ఈ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఇతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు బహిరంగసభ బాధ్యతలను అప్పగించనున్నారు. బహిరంగసభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతోపాటు రాష్ట్ర స్థాయిలోనూ పలువురికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
రింగురోడ్డు ప్రాంతం.. అనువైన ప్రదేశం..
అక్టోబర్లో వరంగల్లో నిర్వహించే భారీ బహిరం గ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోటెత్తనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బహిరంగసభకు దండులా తరలివస్తారు. కరీంనగర్, హైదరాబాద్, ఖ మ్మం ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉండే ప్రదేశంలో సభ పెడితే రవాణా పరంగా ఏ ఇబ్బందీ ఉండదని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తున్నది. వరంగల్ నగర శివారులోని ఔటర్ రింగురోడ్డు వెంట ఉన్న ప్రదేశంలో బహిరంగ సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఉనికిచర్ల, దేవన్నపేట ప్రాం తాల్లోని 150 ఎకరాల్లో బహిరంగ సభను నిర్వహించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ఈ వేదిక నుంచే ప్రజలకు వివరించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగిం పు బీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచేలా వరంగల్ బహిరంగ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తున్నది.
తెలంగాణ ఏర్పాటు లక్ష్యంతో ఆవిర్భవించిన టీఆర్ఎస్ ప్రస్థానంలో వరంగల్ కీలకంగా ఉంటున్నది. ఉద్యమనేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇక్కడ జరిగిన ప్రతి సభకు జనం బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించారు. 2010 డిసెంబర్ 16న తెలంగాణ మహాగర్జన పేరుతో నగరంలోని ప్రకాశ్రెడ్డిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఆర్య సమాజ్ అధ్యక్షుడు స్వామి అగ్నివేశ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగ సభగా ఇది రికార్డు సృష్టించింది. 2017లో టీఆర్ఎస్ వార్షికోత్సవం సందర్భంగా పది లక్షల మందితో నిర్వహించిన ప్రగతి నివేదన సభ దేశంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడూ వరంగల్ బహిరంగ సభతో గత రెండు ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయనే అంచనాలున్నాయి.