హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 23 : యాసంగి పంటలకు సంబంధించి కాకతీయ కాల్వకు జనవరి 1న సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా వారబందీ పద్ధతిలో ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్లోనే నీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాం (ఎల్ఎండీ) లో 19.53టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో నుంచి 7టీఎంసీలను సాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగతా నీటిని కరీంనగర్, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల వరకు తరలిస్తారు. మిడ్ మానేరులో సైతం 23.06టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో సైతం పుష్కలంగా నీరు ఉంది. యాసంగి పంటలకు సరిపడా నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రైతులు సాధ్యమైనంత వరకు ఆరుతడి పంటలకే మొగ్గు చూపాలని ఎల్ఎండీ ఈఎస్సీ శంకర్ పేర్కొన్నారు.