తాడ్వాయి, జనవరి27: వచ్చే నెల 21నుంచి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు రావాలని కోరుతూ శనివారం అమ్మవార్ల పూజారులు హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి ఆహ్వానించారు. అమ్మవార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు సీఎంతోపాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖను కలిసి మహాజాతర పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం మేడారం జాతరలో చేపట్టాల్సిన పనులు, పూజారుల సమస్యలను జగ్గారావు ముఖ్యమంత్రికి వివరించారు. మహాజాతరకు వచ్చి తల్లుల తీర్థప్రసాదాలను అందుకోవాలని కోరగా, ఫిబ్రవరి 23వ తేదీన అమ్మవార్ల దర్శనానికి వస్తానని సీఎం తేదీని ఖరారు చేశారు.