ఖిలావరంగల్, ఫిబ్రవరి 4: తల్లీకొడుకు మృతిపై మిల్స్కాలనీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రంగశాయిపేటకు చెందిన తస్లీమ్ సుల్తానాతోపాటు తన ఏడు నెలల కుమారుడి మృతదేహాలు పర్వతగిరి మండలం అన్నారంషరీఫ్ దర్గా చెరువులో లభించాయి. శుక్రవారం తస్లీమ్ సుల్తానా మృతదేహాన్ని పోలీసులు గజఈతగాళ్లతో బయటకు తీయించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం ఆమె కుమారుడి మృతదేహం కూడా అదే చెరువులో లభించింది. దీంతో వరంగల్, మామునూరు ఏసీపీలు కిషన్, సతీశ్బాబు, మిల్స్కాలనీ సీఐ సురేశ్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
బాలుడి మృతదేహాన్ని ఎంజీఎం దవాఖానలోని మార్చురీలో భద్రపరిచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా, భర్త తన్వీర్తోపాటు అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం చేసిన వేధింపుల వల్లే తస్లీమ్ సుల్తానా తన కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె భర్తతోపాటు అత్తమామ ఇతర కుటుంబ సభ్యులు కలిపి ఆరుగురిపై కేసు నమోదు చేయగా, భర్త పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.