హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 13 : సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వరంగల్ నిట్ లైబ్రరీ అగ్రగామిగా ఉందని నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు అన్నారు. ఆరో ఐ-ఎల్ఐఎస్ఎస్ సెంట్రల్ లైబ్రరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఇంటర్నేషనల్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సొసైటీ, దక్షిణ కొరియాలోని కీమ్యుంగ్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘ఆండ్రాయిడ్ సొసైటీకి లైబ్రరీలను పునరుద్ధరించడం’అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం నిర్వహించాయి. మొదటి రోజు నిట్ బోస్ హాల్లో జరిగిన సదస్సులో ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కే వీరాంజనేయులు సదస్సుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రెండు రోజుల్లో సుమారు 130 పత్రాలను సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. 5 దేశాల నుంచి 150 మంది ఈ సదస్సులో పాల్గొంటున్నారని చెప్పారు. మద్రాస్ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ రమేశ్బాబు ప్రసంగిస్తూ సొసైటీ ఆవిర్భావం గురించి వివరించారు. లైబ్రరీ డీన్ అకడమిక్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్వీ ఉమామహేశ్ మాట్లాడుతూ ఇటువంటి ముఖ్యమైన అంశంపై సదస్సు నిర్వహించడం అభినందనీయమన్నారు.
విద్యాసంస్థలకు లైబ్రరీ సైన్సెస్ ప్రాముఖ్యతను వివరించారు. రేపటిలోగా ఈ సదస్సు కొన్ని ముఖ్యమైన చర్చలకు దారి తీస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ కరోనా సమయంలో వరంగల్ నిట్ లైబ్రరీ డిజిటల్ మోడ్ ద్వారా వనరులను తీసుకురావడానికి చొరవ తీసుకుందని, సమయాన్ని ఆదా చేయడానికి ఆర్ఎఫ్ఐడీ సాంకేతికతను తీసుకొచ్చినట్లు చెప్పారు. 24 గంటలు రీడింగ్ రూం సౌకర్యం ఉన్నాయని వివరించారు. విద్యార్థులకు మరిన్ని వసతులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలకు గ్రంథాలయాలు హృదయమని, కొన్ని ఉపయోగకరమైన చర్చలను తీసుకురావడానికి ఇటువంటి సదస్సు జరుగడం చాలా ముఖ్యం అన్నారు. గౌరవ అతిథి డాక్టర్ ఎం కోటేశ్వర్రావు గ్రంథాలయాలు కాలానుగుణంగా వస్తున్న విప్లవాత్మక మార్పులపై మాట్లాడారు. థాయిలాండ్లోని ఖోంకేన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ విరపాంగ్ చన్సనమ్ డిజిటల్ సిస్టం ప్రాముఖ్యతపై ప్రసంగించారు. దక్షిణకొరియా నుంచి ఐ-ఎల్ఐఎస్ఎస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ డోంగ్జీయూన్హో వర్చువల్ మోడ్ ద్వారా తన సందేశాన్ని వినిపించారు. 6వ ఐ-ఎల్ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్ను ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు విడుదల చేశారు. వరంగల్ నిట్ డైరెక్టర్గా ఐదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు రమణారావును ఈ సందర్భంగా సన్మానించారు. ఐ-ఎల్ఐఎస్ఎస్ సెక్రటరీ జనరల్ డాక్టర్ రాజేంద్రన్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.