దేవరుప్పుల, ఏప్రిల్ 8 : రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలను చైతన్యపర్చడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసే ధ్యేయంగా పాలకుర్తి సీఐ మహేందర్రెడ్డి వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఉదయం సైకిల్పై 51 కిలోమీటర్లు తన పరిధిలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకొని శనివారం దేవరుప్పుల మండలం నుంచి యాత్ర ప్రారంభించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం సైకిల్పై బయల్దేరిన మహేందర్రెడ్డి నలుగురు కూడిన చోట, కూడళ్లలో, యువత ఉన్న చోట ఆగి మాట్లాడారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయొద్దని, హెల్మెట్ లేకుండా వాహనం నడుపొద్దని సూచనలు చేశారు. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే అనర్థాలను వారికి వివరించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో కలిగే ఉపయోగాలను స్థానిక ప్రజాప్రతినిధులకు వివరిస్తున్నారు. యువత డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచిస్తున్నారు. రోడ్లపై ధాన్యాన్ని ఆరబోస్తే వాహనాలు ప్రమాదాలకు గురవుతాయని చెబుతున్నారు. చిప్పరాళ్లబండ తండాలో హమాలీలతో మాట్లాడి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మరోవైపు సీతారాంపురంలో అనాథ వృద్ధులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. దేవరుప్పుల ఠాణాలో పోలీసులతో మాట్లాడారు. సీఐ వెంట దేవరుప్పుల పోలీసులు యాకేశ్, సంపత్ ఉన్నారు.