కొద్దిరోజుల నుంచి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణాలు, పల్లెల్లో దర్జాగా తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లలో చొరబడి లూటీ చేసేస్తున్నారు. ఇటు ఆలయాల్లోనూ ప్రవేశించి దేవుడి ఆభరణాలు, హుండీలను పగులగొట్టి నగదు ఎత్తుకెళ్తుంటే.. ఇంకొందరు భక్తుడిలా వచ్చి దేవుడికే శఠగోపం పెడుతున్న తీరు విస్తుగొల్పుతున్నది. ముఖ్యంగా వరంగల్ నగరంలో ఆకతాయిలు రెచ్చిపోతున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అయితే చాలాచోట్ల సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, పోలీసుల నిఘా లేకపోవడం వల్లే దొంగతనాలు, రౌడీషీటర్ల ఆగడాలు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో చోరీలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరమున్నది.
తాజాగా వరంగల్ గిర్మాజీపేటలోని ఎల్లమ్మ గుడిలోకి బుధవారం భక్తుడి ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి అమ్మవారికి మొక్కుతున్నట్లు నటించి అమ్మవారి మెడలోని ఏడు గ్రాముల బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు. ఆలయ చైర్మన్ ఫిర్యాదుతో ఇంతెజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు.
వరంగల్ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని చోరీలను పరిశీలిస్తే వరంగల్ శివనగర్లోని రాయల రవి కుటుంబం గత డిసెంబర్ 11న విహారయాత్రకు వెళ్లింది. తిరిగి రాకముందే ఇంట్లో చోరీ జరిగినట్లు యాత్రలో ఉన్న ఆయనకు స్థానికుల ద్వారా సమాచారం అందింది. రవి వచ్చిన తర్వాత పోలీసులు ఇంట్లో పరిశీలించగా రూ.7లక్షల నగదు, 80 తులాల బంగారం ఆభరణాలు చోరీ జరిగినట్లు వెల్లడైంది. మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
డిసెంబర్ 18న వరంగల్లో మిల్స్కాలనీ స్టేషన్ పరిధిలోని ఆటోడ్రైవర్ చేతి దిలీప్ తన కుటుంబంతో వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామానికి వెళ్లాడు. మరుసటి రోజు ఆయన తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని ఐదున్నర తులాల బంగారం, ఆభరణాలు కనిపించలేదు. ఇతర వస్తువులు కూడా లేకపోవడంతో దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఏడాది జనవరి 5న వరంగల్ బొల్లికుంటలో సోల్తి అశోక్ తన కుటుంబ సభ్యు లతో కలిసి గుడికి వెళ్లారు. దర్శనం చేసుకొని తిరిగి వచ్చేలోపు పట్టపగలే దొంగలు తాళం పగులగొట్టి రూ.2 లక్షల నగదు, రూ.2.50 లక్షల విలువ చేసే ఐదు తులాల బంగారం నగలను అపహరించారు. మామునూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండో వారంలో వరంగల్ రామన్నపేటలో ఒక ఆడిటర్ ఇంట్లో చోరీ జరిగింది. అమెరికా వెళ్లిన ఆడిటర్ ఇంట్లోకి దొంగలు ప్రవేశించి నగలు ఎత్తుకెళ్లారు.
నాలుగు రోజుల క్రితం ఖానాపురం మండల కేంద్రంలో ఓ కుటుంబం వేములవాడకు వెళ్లింది. తిరిగి వచ్చేవరకు తమ ఇంట్లోని బంగారం నగలు మాయమైనట్లు సదరు కుటుంబం లీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం నర్సంపేటలో ఒక వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది.
చోరీలతో పాటు దాడులు, ప్రతిదాడులు కూడా పెరిగాయి. ఆకతాయిల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతున్నది. రౌడీషీటర్లలో కొందరు మళ్లీ జూలు విదిలిస్తున్నారు. ప్రధానంగా వరంగల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకొంటున్నాయి. గత డిసెంబర్ 31న శివనగర్లో ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిపై రాళ్లు, గాజుపెంకులతో దాడికి తెగబడ్డారు. కొద్దిరోజుల క్రితం కరీమాబాద్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఉర్సు బీఆర్నగర్లో ఓ యువకుడిపై కొందరు కత్తులు, రాళ్లతో దాడికి ఒడిగట్టారు. మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వృద్ధుడి తలపై ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు. శివనగర్లో ఇటీవల ఒకరి ఇంటి ముందు పార్కు చేసి ఉన్న కారుకు కొందరు నిప్పు పెట్టారు. పోలీసుల నిఘా కొరవడడం వల్లే చోరీలు, దాడులు జరుగుతున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. వరంగల్తో పాటు ఇతర పట్టణాలు, గ్రామాల్లో గతంలో పోలీసులు దాతలు, వ్యాపారులు, స్థానికుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చాలావరకు పనిచేయడం లేదు. కొన్నిచోట్ల కెమెరాలు ధ్వంసమయ్యాయి. కెమెరాలు పగిలి, వైర్లు తెగి ఉన్నాయి. మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు దర్శనమిస్తున్నా అవి పనికి రాకుండా ఉన్నాయి. తమ వ్యవహారం బయటపడుతుందని ఆకతాయిలు, దొంగలు, రౌడీషీటర్లు కొందరు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేస్తున్నట్లు తెలిసింది. దీంతో వరంగల్ సహా ఇతర ప్రాంతాల్లో జరిగేవేవీ సీసీ కెమెరాల్లో నమోదు కావడం లేదు. వెరసి పోలీసులు గతంలో మాదిరిగా సులువుగా నేరస్తులను గుర్తించలేకపోతున్నట్లు సమాచారం.