హనుమకొండ సబర్బన్, ఫిబ్రవరి 14 : దామెర.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఒక ఊరు. 1400 గడపలు. కొన్నేండ్ల కిందటి వరకు ఈ ఊరు కరువుకు మారుపేరు. నక్సలైట్లు, పోలీసుల మధ్య నలిగి 23 మంది యువకులను కోల్పోయింది. అటు కొడుకులను పోగొట్టుకొని ఉన్న పిల్లలను సాదుకునేందుకు 50 కిలోమీటర్ల దూరం వరకు కూలి పనులకు వెళ్లిన అనుభవం ఈ ఊరి తల్లులది. గుక్కెడు నీళ్లు తాగాలంటే ఊరి బయట కిలోమీటర్ల కొద్దీ పరుగులు.. చేద్దామంటే పనిలేక వలసలు.. ఇవన్నీ చూసి పిల్లనిచ్చేందుకు ముందుకురాని ఆడబిడ్డలు.. ఇలా ఎన్నో దుర్భర పరిస్థితులు, అనేక సమస్యలు ఎదుర్కొన్న ఇక్కడి ప్రజల తలరాత తెలంగాణ రాకతో మారుతూ వచ్చింది. కేసీఆర్ సర్కారు పాలనలో గ్రామంలో సకల సౌకర్యాలు సమకూరడంతో పాటు పుష్కలంగా సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్కు తోడు ‘రైతుబంధు’తో వ్యవసాయం పండుగైంది. ఇలా ఎనిమిదేళ్లలో ఊరి రూపురేఖలు మారి ప్రగతిపథంలో పరుగెడుతోంది.
ఎల్కతుర్తి మండలంలో అత్యధిక జనాభా, వ్యవసాయ విస్తీర్ణం ఉన్న ఊరు దామెర. మండల కేంద్రం కంటే పెద్ద ఊరు. పట్టా, ప్రభుత్వ భూమి కలిపితే ఆరు వేల ఎకరాల వరకు ఉన్నది. భూగర్భ జలాలు అందనంత దూరంలో ఉండేవి. ఏ వ్యవసాయ బావిని చూసినా ఎండిపోయి మట్టి కనిపించేది. 1990 నుంచి 2010 వరకు ఈ ఊర్లో తాగునీరు ఉండేది కాదు. ఊరి జనం మొత్తం కిలోమీటర్ దూరంలోని బావిపై ఆధారపడేవారు. నడి ఎండాకాలంలో ఆ బావిలో నీళ్లు అయిపోతే మళ్లీ ఊరే దాకా లైన్లో నిలబడాల్సిందే. ఊరి చుట్టూ గుట్టలు, చెట్లు మాత్రమే ఉండేవి. సాగునీరు లేక పట్టా భూములు పడావుగా ఉండేవి. కరువుకు తోడు ఏ పనీ లేక యువకులు నక్సలిజం వైపు మళ్లేవారు. అనేకమంది వలస పోయారు. ఇక ఆడవాళ్లు పదుల కిలోమీటర్లు నడిచి కాకతీయ కాలువ కింద కూలి పనులకు వెళ్లేవారు. పిల్లలు నిద్రలేవక ముందు ఇంటినుంచి వెళ్తే తిరిగి రాత్రి వాళ్లు పడుకున్న తర్వాతే తిరిగి వచ్చే వారు. పిల్లలను చూసుకునే బాధ్యత ఇంట్లోని ముసలివాళ్లు తీసుకునేది. పిల్లలకు రోజుల తరబడి తమ తల్లిదండ్రులు కనిపించకపోయేది. వ్యవసాయ భూములున్న రైతులది ఇదే దుస్థితి.
గుడిసెలు పోయి.. బంగ్లాలు వచ్చె..
దామెర జనాభా 5597 మంది. 1393 ఇండ్లు ఉన్నాయి. పూరి గుడిసెలు మాత్రమే ఉండేటి ఈ ఊరిలో ఇప్పుడు రెండుమూడు అంతస్థుల భవనాలూ వెలిశాయి. ఐదారేండ్లలోనే 800 కుటుంబాలు కొత్తగా డాబా ఇండ్లు కట్టుకున్నాయి. ఒకప్పుడు ఎవరికో ఒకరికి సైకిల్ ఉండే ఈ ఊరిలో ఇప్పుడు మోటరు సైకిళ్లు, స్కూట్లర్లు కలిపి 500 వరకు ఉన్నాయి. 20 కార్లు, 4 హార్వెస్టర్లు, 2 ఎక్స్కవేటర్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయి. తాగునీటికీ ఏ చిన్న ఇబ్బంది లేదు. పదేళ్ల క్రితం ఈ ఊరికి వచ్చిన వారు ఇప్పుడు వస్తే పొలం, చెలక, ఊరిలోని సందులను దేన్నీ పోల్చుకునే పరిస్థితి లేదు.
వెయ్యి నుంచి 5వేల ఎకరాలకు..
1995లో దామెరలో 1006 ఎకరాల్లోనే పంటలు వేసేవారు. 80శాతం వర్షాధారం కనుక ఈ మాత్రం సాగయ్యేది. 2003లో అది కాస్తా 1480 ఎకరాలకు పెరిగింది. ఆ తర్వాత పదేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. 2015-16 నాటికి 2118 ఎకరాలు, 2018-19లో 3076 ఎకరాలు, 2020-21లో 3709 ఎకరాలు, 2021-22లో 4706 ఎకరాల్లో పంటలు వేశారు. ప్రస్తుత 2022-23లో రికార్డు స్థాయిలో 4900 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకుని దామెరవాసులు ముందుకు సాగుతున్నారు.
నీళ్లతో మార్పు మొదలు
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమ నేత కేసీఆర్ చేపట్టిన పోరాటంతో 2001లో అప్పటి ప్రభుత్వం హడావిడిగా, సరైన ప్రణాళిక లేకుండా దేవాదుల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసింది. ఆ ప్రాజెక్టు ఆగుతూ, నెమ్మదిగా సాగి నిర్ణీత స్థాయిలో పంపింగ్ జరుగలేదు. ఏడాదిలో 170 రోజులు పంపింగ్ అని చెప్పి 70రోజులు కూడా నీళ్లు ఇవ్వలేదు. 2014లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత దేవాదులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి ధర్మసాగర్ రిజర్వాయర్లో నీటి నిల్వ పెంచడంతో భూగర్భ జలాలు అమాంతం పెరిగాయి. ఫలితంగా దామెరలోని పాడుబడిన బావులకు నీటి ఊట వచ్చింది. ఇలా అప్పుడప్పుడు మాత్రమే నిండే చెరువు ఏడాదంతా కళకళలాడడంతో రైతులకు నమ్మకం పెరిగింది. పడావు భూములను సాగుకు యోగ్యంగా మార్చుకొని ఊరికి ఐదు కిలోమీటర్ల దూరంలోని గుట్టల దాకా ఉన్న భూములను చదును చేసుకుని సాగుచేసుకుంటున్నారు.
ఉచిత కరెంటు, రైతుబంధుతో..
సీఎం కేసీఆర్ ప్రణాళికతో వ్యవసాయానికి సరిపడా నీటి వనరులు వచ్చాయి. ఆ నీటిని పొలాలకు ఇచ్చేందుకు వాడే కరెంటును ఉచితంగా, అదీ నిరంతరాయంగా ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో విస్తీర్ణం మరింత పెరిగింది. దామెరలో 820 వ్యవసాయ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజూ 41వేల యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తున్నారు. నీళ్లు, కరెంటుతో పాటు పెట్టుబడిని సమకూర్చడం కోసం ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని మొదలుపెట్టింది. రైతుబంధు కింద 10 విడతల్లో ఇక్కడి రైతులకు రూ.7 కోట్ల 46 లక్షల 8వేల 6 ఇచ్చింది. దీంతో చిన్న రైతులు మొత్తం భూమిని సాగు చేస్తూ భూమి ఖాళీగా లేకుండా పంటలు వేస్తున్నారు. రైతులు స్వయం సమృద్ధి సాధిస్తున్నారు. అలాగే రైతు బీమా పథకం ఈ ఊరిలోని 30 కుటుంబాలకు రూ.15 కోట్లను అందజేసి భరోసా కల్పించింది.
సాగులో వైవిధ్యం
ఎటుచూసినా నీళ్లు, నిరంతరం ఉచిత కరెంటు, పెట్టుబడి ఖర్చులు… ఇవి ఉంటే వరి పొలం పెడితే సరిపోతుంది. అని చాలా మంది అనుకుంటారు. దామెరలోని రైతులు కొత్తగా ఆలోచించారు. ఈ ఊరిలో తీరొక్క పంటలు సాగు చేస్తారు. పత్తి, వరి, మక్కజొన్న, పసుపు, మామిడి, మిరప, ఉల్లిగడ్డ, పామాయిల్, కూరగాయలు, పెర్కిన్ లాంటి భిన్నమైన పంటలు సాగుచేస్తున్నారు. దామెర ఊరు ఉల్లిగడ్డ సాగుకు ప్రసిద్ధి. మన రాష్ట్రంలో ఒక ఏడాదిలో ఎక్కువ ఉల్లిగడ్డలు పండించిన గ్రామంగా రికార్డులకు ఎక్కింది. అందుకే ఈ ఊరిని ఉల్లిగడ్డ దామెర అని పిలుస్తుంటారు. యేటా సగటున రూ.25 కోట్ల 43 లక్షల పంట పండిస్తున్నారు. పాడి పరిశ్రమ సైతం ఇక్కడ ఎక్కువే. 354 ఆవులు, 336 బర్రెలు, 5200 గొర్రెలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో 122 గొర్రెల యూనిట్లను ఇచ్చి ఆర్థిక భరోసా ఇచ్చింది. అంతేగాక దామెరలో ఫార్మర్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్(ఎఫ్పీవో) విజయవంతంగా నడుస్తున్నది. ఇప్పుడు దామెరలో కరువు అంటే ఎలా ఉంటుందనే పరిస్థితి. ఇప్పటి తరానికి నీళ్లు లేని ఊరు ఎలా ఉంటుందో తెలియదు. రైతులు కష్టపడి పిల్లలకు నాణ్యమైన చదువులు చెప్పిస్తున్నారు. ఈ ఊరి నుంచి ఇప్పుడు 50 మందికిపైగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉండగా వందలాది మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు.
ఇప్పుడు ఇక్కడ్నే ఫుల్లు పని..
ఒకప్పుడు వ్యవసాయం చేయాల్నంటే దుఃఖం వచ్చేది. బాయిలల్ల నీళ్లుండకపోయేది. ఒక్కోసారి నీళ్లున్నా కరంటుండేది కాదు. అరిగోస అయ్యేది. మా ఊరోళ్లంత జమ్మికుంట అవుతలికి పత్తి ఏరేందుకు పోయేది. ఇప్పుడు ఇక్కడ పని చేద్దామంటే తీరుతలేదు. మా ఊరోళ్లే కాకుంట పక్కపొంటి ఊర్లోళ్లు సుత మా ఊరుకి కూలికి వత్తాన్లు. నిజంగ గిసొంటి రోజొకటి వత్తదని నేను కలల గూడ అనుకోలేదు. తెలంగాణ అచ్చినంకనే గిట్ల జరిగింది. అంతకుమునుపు దేవాదుల నీళ్లు యేడాదికి పది రోజులు కూడా రాకపోయేది. ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లేనాయె.
– మిట్టపెల్లి మోహన్రెడ్డి, రైతు
ఇబ్బందులు తప్పినయ్
మా ఊరు ఒకప్పుడు మొత్తం కరువుతోనే ఉండేది. సాగునీరు లేదు, కావాల్సినంత కరంటు లేదు. ఇప్పుడు ఎక్కడచూసినా సాగునీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయానికి ఉచితంగా కరెంటు వస్తున్నది. మా ఊరి రైతులు అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
– చల్లా రవీందర్రెడ్డి, సర్పంచ్
దామెర అభివృద్ధి కనిపిస్తున్నది
దామెర గ్రామస్తులది మొదటినుంచి బాగా కష్టపడేతత్వం. వనరులు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ ప్రాంతానికి సాగునీరు వచ్చేలా చేశారు. మిషన్ కాకతీయ పథకంలో ఊరిలోని చెరువులను మరమ్మతు చేశాం. వ్యవసాయానికి లోవోల్టేజ్ సమస్య లేకుండా సబ్స్టేషన్ నిర్మించి అందుబాటులోకి తెచ్చాం. దామెర అభివృద్ధిపై మరింతగా ఫోకస్ చేస్తా.
– వొడితల సతీశ్కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే