వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాశ్ అన్నారు. ఆదివారం వరంగల్ సమీకృత కలెక్టర్ భవన నిర్మాణ స్థలంలో ఏర్పాటు చేసిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణ అఖండ భారతంలో విలీనమయ్యిందన్నారు. అప్పుడే తెలంగాణకు అధికారంగా స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. ఎందరో మహానుభావులు నిజాం పాలన నుంచి తెలంగాణను రక్షించడానికి తమ ప్రాణాలు అర్పించారన్నారు. 58 సంవత్సరాలు శాపగ్రస్థ జీవితాలను గడిపిన తెలంగాణ ప్రజలు స్వరాష్ట్ర సాధనతో శాపవిముక్తులు అయ్యారన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సంక్షేమ పథకాల వివరించారు.
వ్యవసాయ రంగానికి అండ
నేడు రాష్ట్రంలో 2లక్షల 79వేల 703 ఎకరాలలో వ్యవసాయ ఉత్పత్తులు పండించబడుతున్నాయని అన్నారు. వ్యవసాయరంగానికి అండగా ఉండటంతో పాటుగా రైతుల సంక్షేమం కోసం 2022-23 వార్షిక సంవత్సరానికి యాసంగి కాలానికి లక్షా 43వేల 730 మంది రైతులకు132 కోట్లు, వానకాలానికి లక్షా 52 వేల 499 మంది రైతులకు 137 కోట్ల రూపాయలతో రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
మెగా టెక్స్టైల్ ద్వారా వేల మందికి ఉపాధి
సంగెం, గీసుకొండ మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా 1 లక్షా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు అందనున్నాయన్నారు. ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల నిర్మాణానికి 80 కోట్లు, డీఎంఎఫ్టీ స్కీం ద్వారా 31కోట్ల అంచనా వ్యయంతో 116.2 కి.మీ. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రూ.94 కోట్లతో ఊకల్ వద్ద ఆర్ఓబీ నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 645 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 90కోట్లతో మౌలిక వసతులు మెరుగు పరచడం జరుగుతుందన్నారు.
మెరుగైన వైద్య సేవలు
ఎంజీఎం, ప్రాంతీయ నేత్ర వైద్యశాల, సీకేఎం దవాఖానలతో పాటు 14 పీహెచ్సీలు, 7పట్టణ ఆరోగ్య కేంద్రాలు, నర్సంపేట, వర్ధన్నపేట దవాఖానలు, 118 ఉప కేంద్రాలు, పల్లె దవాఖానల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. దాంతో పాటుగా రూ.1200 కోట్ల వ్యయంతో సుమారు 2,100 పడకల సామర్థ్యం కలిగిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ముఖ్య అతిథి చేతులమీదుగా వారికి ప్రసంసాపత్రాలను అందజేశారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్స, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్రావు, డీసీపీ రవీందర్, పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.