సుబేదారి, డిసెంబర్ 30 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2022లో జరిగిన నేరాల నివేదికను సీపీ ఏవీ రంగనాథ్ శుక్రవారం వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణకోసం పోలీసు శాఖ తీసుకుంటున్న బహుముఖ వ్యూహంతో అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాన్నిచ్చాయి. సైబర్ నేరాలు పెరిగాయి. ఆధునిక టెక్నాలజీతో నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. నిందితులపై పీడీయాక్ట్ వంటి కఠినమైన చట్టాలను అమలుచేసి శిక్ష పడేలా పోలీసు అధికారులు చర్యలు తీసుకున్నారు.
బ్లూ కోల్ట్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, పెట్రోకార్స్ ద్వారా నిరంతర పెట్రోలింగ్, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, మహిళల భద్రత కోసం షీ టీమ్స్ మరింత పటిష్టంగా పనిచేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా నేరాల కట్టడిపై పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి, నేరాలను కట్టడిచేస్తున్నారు. హత్యలు 2021లో 51 కాగా, 2022లో 36 జరిగాయి. దోపిడీలు ఏడాది 472, ఈసారి 535, లైంగిక దాడులు గత ఏడాది 83, 2022లో 129, మోసాలు గత ఏడాది 705, ఈసారి 1,449, హత్యాయత్నాలు 2021లో 68, 2022లో 83, రోడ్డు ప్రమాదాలు 2021లో 630, మృతులు 443 , 2022లో 644, మృతుల సంఖ్య 424, అదృశ్యం కేసులు 2021లో 842, 2022లో 930 నమోదయాయి. మొత్తం కేసులు గత ఏడాది 11,047, 2022లో 12,966 ఉన్నాయి. పీడీయాక్ట్లు 2021లో 55, 2022లో 60 మందిపై నమోదయ్యాయి. ఆస్తుల రికవరీ సుమారు రూ.6కోట్లు (50 శాతం) అయ్యాయి.
మహిళలపై నేరాలు, వరకట్న హత్యలు 2021లో 4, 2022లో ఒకటి, వరకట్న మరణాలు 2021లో 10, 2022లో 14, ఆత్మహత్యలు 2021లో 34, 2022లో 27, అత్యాచారాలు 2021లో 96, 2022లో 129, కిడ్నాప్లు 2021 ఏడాదిలో 152, 2022 ఏడాదిలో 177, చిన్నారులపై నేరాలు, హత్యలు 2021లో లేవు, 2022లో ఒకటి, అత్యాచారాలు 2021లో 49, 2022లో 80, పోక్సో కేసులు 2021లో 109, 2022లో 152, సైబర్ నేరాల్లో చీటింగ్ కేసులు 2021లో 106, 2022లో 560 నమోదయ్యాయి. ఆర్థిక నేరాలు 2021లో 446 కేసులు , 2022లో 774 కేసులు, నిందితుల జైలు శిక్షలు 2021లో 83 మంది ఉండగా వీరిలో 10 మందికి లైఫ్ శిక్ష, పదేళ్ల శిక్ష ఇద్దరికి, ఎనిమిదేళ్ల శిక్ష ఒక్కరికి, ఐదేళ్ల శిక్ష ఇద్దరికి పడింది. ట్రాఫిక్ జరిమానాలు 2021లో 8,65,341 కేసులు, 2022లో 15,29,073 పడ్డాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 2021లో 11,980, 2022లో 23,669. టాస్క్ఫోర్స్ ఈఏడాది 31 కేసుల్లో రూ.6.40కోట్ల విలువైన 5వేల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
104 మందిని అరెస్ట్ చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. క్రికెట్ బెట్టింగ్, వాహనాల దొంగలను పట్టుకున్నారు. సిటీ క్రైం స్టేషన్ పోలీసులు ఏడాదికాలంలో 122 కేసులను ఛేదించారు. రూ.1.30 కోట్ల విలువైన రెండు కిలోల బంగారం, 690 గ్రాముల వెండి, రూ.12లక్షలు నగదు,14 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 15 మంది ఉన్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు. ఈ ఏడాదిలో మహిళా భద్రతకోసం షీ టీమ్స్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. 88 ఫిర్యాదులు రాగా, 78 మందిపై కేసులు నమోదు చేశారు.
నిబంధనలు పాటించాలి
న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. 2022 ఏడాదికి వీడ్కోలు పలికి, 2023 కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంలో నియమ నిబంధనల పాటించాలని సూచించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో శనివారం రాత్రి 9గంటల నుంచి తెల్లవారుజామున 3గంటల వరకు ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రైసిటీలో 50కిపైగా ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ నిర్వహించి, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తామని పేర్కొన్నారు.
మద్యం తాగి వాహనాలు నడుపొద్దని, మైనర్లు వాహనాలు నడపొద్దు, త్రిబుల్రైడింగ్, ఓవర్స్పీడ్, సైలెన్సర్ తీసి బైక్లు నడిపిన కఠినచర్యలు తీసుకుంటామని సీపీ, వాహనదారులను హెచ్చరించారు. డీజేలకు అనుమతి లేదని, వాణిజ్య వ్యాపార సముదాయాలు నిర్దేశించిన సమయం వరకు మూసేయాలని, యజమానులకు సీపీ సూచించారు. పబ్లిక్ ప్రదేశాల్లో, ప్రధాన రోడ్ల వెంట నూతన సంవత్సర వేడుకలు నిర్వహించొద్దని, కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే జరుపుకోవాలని సీపీ సూచించారు.